Thursday, 28 June 2018

ఏప్రిల్ 2018 సైన్స్ & టెక్నాలజీ

జీవ గ్రహాల అన్వేషణకు వ్యోమనౌక 
సౌరకుటుంబం వెలుపల గ్రహాంతర జీవులకు ఆవాసం కల్పించేందుకు అనువుగా ఉన్న గ్రహాల అన్వేషణకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తొలిసారిగా వ్యోమనౌకను ప్రయోగించింది. ఫ్లోరిడాలోని కేప్ కెనవెరాల్ అంతరిక్ష కేంద్రం నుంచి ఏప్రిల్ 19న వ్యోమనౌకను ప్రయోగించారు.

ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఐ ప్రయోగం విజయవంతంభారత్‌కు సొంత నావిగేషన్ వ్యవస్థ (నావిక్)ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఐ ఉపగ్రహం ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్) నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ41 వాహకనౌక ద్వారా ఏప్రిల్ 12న ప్రయోగించిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఐను ఇస్రో విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో 43వ ఉపగ్రహం అయిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఐ (రీప్లేస్‌మెంట్) బరువు 1,425 కిలోలు. ఇందులో ఎల్5, ఎస్‌బ్యాండ్ నావిగేషన్ సాధనాలు, రుబీడియరం పరమాణు గడియారాలు, సీబ్యాండ్ రేంజింగ్ పేలోడ్, లేజర్ రేంజింగ్ కోసం కార్నర్ క్యూబ్ రెట్రో రెఫ్లెక్టర్లున్నాయి. దీని పరిమాణం 1.58 మీ. × 1.5 మీ. × 1.5 మీ. ఈ ఉపగ్రహాన్ని బెంగళూరులోని ఆల్ఫా డిజైన్ టెక్నాలజీస్, ఇస్రో సంయుక్తంగా రూపొందించాయి. 
ప్రయోగం జరిగిందిలా..
321 టన్నుల బరువు, 44.4 మీటర్ల పొడవున్న సీ41 రాకెట్ ప్రయోగంను మొత్తం నాలుగు దశల్లో ఆరు ఎక్సెల్ స్ట్రాపాన్ బూస్టర్ల సహాయంతో చేపట్టారు. మొదటిదశలో స్ట్రాపాన్ బూస్టర్లలో నింపిన 73.2 టన్నుల ఘన ఇంధనం, కోర్ అలోన్ దశలో నింపిన 138.2 టన్నుల ఘన ఇంధనం సహాయంతో 110 సెకన్లలో మొదటి దశను పూర్తిచేశారు. ఆ తర్వాత 42 టన్నుల ద్రవ ఇంధనంతో 263 సెకండ్లకు రెండో దశ, 7.6 టన్నుల ఘన ఇంధనంతో 598 సెకండ్లకు మూడోదశ, 2.5 టన్నుల ద్రవ ఇంధనంతో 1122 సెకండ్లకు నాలుగోదశ పూర్తయింది. ఈ ఉపగ్రహాన్ని పెరీజీ (భూమిగా దగ్గరగా) 284 కిలోమీటర్లు, అపోజీ (భూమికి దూరంగా) 20,650 కిలోమీటర్ల ఎత్తులో భూ బదిలీ కక్ష్యలో ప్రవేశపెట్టారు. అనంతరం 827 కిలోల ద్రవ ఇంధనాన్ని దశల వారీగా మండించి ఉపగ్రహాన్ని భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిరకక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.
నావిక్ దిక్సూచీ వ్యవస్థ పనిచేయడానికి కనీసం ఏడు ఉపగ్రహాలు అవసరం కాగా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ సిరీస్‌లో ఇది తొమ్మిదో ఉపగ్రహం. ఇందులో మొదటి ఉపగ్రహం ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఎ ను 2013 జులై 1న కక్ష్యలోకి పంపారు. ఇందులో సమయాన్ని నిర్ధరించడానికి ఏర్పాటు చేసిన మూడు రుబీడియం గడియారాలు విఫలమయ్యాయి. దాని స్థానంలో 2017 ఆగస్టు 31న ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1హెచ్ ఉపగ్రహంను ప్రయోగించారు. ఉష్ణకవచాలు తెరుచుకోకపోవడంతో ప్రయోగం చివరి దశలో ఇది కూడా విఫలమైంది. దీంతో తాజాగా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ -1ఐను ఇస్రో ప్రవేశపెట్టింది. ఈ సిరీస్‌లో కొన్ని ఉపగ్రహాలు భూస్థిర కక్ష్య (జీఈవో) లో మరికొన్ని భూఅనువర్తిత కక్ష్య (జీఎస్‌వో)లో పరిభ్రమిస్తాయి.
ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఐ ఉపయోగాలు
  • నింగి, నేల, నీటిలో కూడా నావిగేషన్ సేవలు అందిస్తుంది.
  • సైనికులకు ఖచ్చితత్వంతో కూడిన సమయాన్ని చూపిస్తుంది.
  • మత్స్యకారులు, విపత్తు నిర్వహణ సేవలను అందిస్తుంది.
  • వాహనాల గమనం, మొబైల్ ఫోన్లతో వాహనాల అనుసంధానం
  • మ్యాపింగ్ వంటి తదితర సేవలు కూడా పొందవచ్చు.
నావిక్ లేదా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ అంటే?
అమెరికా ప్రవేశపెట్టిన గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (జీపీఎస్) తరహాలో భారత్‌కు సొంత దిక్సూచి (నావిగేషన్) వ్యవస్థ ఉండాలని ఇస్రో ఈ ప్రాజెక్టును చేపట్టింది. దీని వల్ల భారత్ చుట్టూ 1500 కిలోమీటర్ల మేర నిర్ధిష్ట సమయం, పొజిషన్, నావిగేషన్ వంటి సేవలు అందుబాటులోకి వస్తాయి. ఈ ప్రాజెక్టు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు రూ.2,246 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ వ్యవస్థను అంతర్జాతీయ స్థాయికి విస్తరించడానికి గ్లోబల్ ఇండియన్ నావిగేషనల్ సిస్టమ్ (జీఐఎన్‌ఎస్)ను ఇస్రో చేపట్టనుంది. 
దేశాలు - దిక్సూచీ వ్యవస్థలు
దేశాలు
దిక్సూచీ వ్యవస్థలు
అమెరికా
జీపీఎస్
రష్యా
గ్లోనాస్
యూరప్
గెలీలియో
భారత్
నావిక్

సూర్యుడి వద్దకు తెలంగాణ విద్యార్థుల పేర్లు
 
సంగారెడ్డి జిల్లా విద్యార్థులు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ద్వారా సూర్యుడి వద్దకు తమ పేర్లను పంపే అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. జిన్నారం మండలం బొల్లారం గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన ఫణిధర్, నరేశ్, ఉదయ్, గౌతమి, అనితలకు ఈ అవకాశం దక్కింది.
సౌర వ్యవస్థ, గ్రహాల వాతావరణంపై సూర్యుడి ప్రభావం గురించి సూర్యుడికి అతిదగ్గరగా అధ్యయనం చేసేందుకు నాసా మే నెలలో ‘పార్కర్ పోలార్ ప్రోబ్ స్పేస్ క్రాఫ్ట్’ అనే యంత్రాన్ని అంతరిక్షంలోకి పంపుతోంది. ఈ యంత్రంలో ఉండే మెమొరీ కార్డులో పేర్లను నిక్షిప్తం చేసి పంపడానికి ఔత్సాహికుల నుంచి దరఖాస్తులు కోరింది. ఇందుకోసం దరఖాస్తు చేసిన తమ పాఠశాల విద్యార్థులకు ఈ అవకాశం దక్కిందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మాణిక్‌రెడ్డి తెలిపారు.


భూస్థిర కక్ష్యలోకి ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఐ
నావిగేషన్ శాటిలైట్ ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఐ ని భూ స్థిర కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. బెంగళూరులోని హసన్‌లో ఉన్న మాస్టర్ కంట్రోల్ సెంటర్ శాస్త్రవేత్తలు నాలుగు విడతలుగా కక్ష్యదూరాన్ని పెంచి ఉపగ్రహాన్ని పెరిజీ (భూమికి దగ్గరగా) 35,462 కిలోమీటర్లు, అపోజి (భూమికి దూరంగా) 35,737 కిలోమీటర్ల ఎత్తులో ప్రవేశపెట్టారు. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఐ ని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ41 ఉపగ్రహ వాహకనౌక ద్వారా ఏప్రిల్ 12న రోదసిలోకి పంపారు.


హైస్పీడ్ ఎలక్ట్రికల్ రైలు ఇంజన్ ప్రారంభం
భారతదేశ తొలి హైస్పీడ్ ఎలక్ట్రికల్ రైలు ఇంజన్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏప్రిల్ 10న బిహార్‌లోని మోతిహరీ నుంచి రిమోట్ ద్వారా ప్రారంభించారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా భారతీయ రైల్వే, ఫ్రెంచ్ తయారీ సంస్థ అల్‌స్టోమ్ సంయుక్తంగా 12,000 హార్స్‌పవర్ సామర్థ్యం గల రైలు ఇంజన్‌ను తయారుచేశాయి. వచ్చే 11 ఏళ్లలో మరో 800 రైలు ఇంజన్లను తయారుచేయాలని భారతీయ రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది.

సైబర్ నేరాలకు కొత్త అస్త్రం క్రిప్టోజాకింగ్ సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారు కొత్త పద్ధతులు వినియోగిస్తున్నారని ఇంటర్నెట్ సెక్యూరిటీ సంస్థ సైమాంటిక్ తెలిపింది. సంప్రదాయ సైబర్ నేరాలతో సంపాదన తగ్గిపోతుండటంతో కొత్త పద్ధతుల్లో ఈ నేరాలకు పాల్పడుతున్నారని ఇంటర్నెట్ సెక్యూరిటీ థ్రెట్ రిపోర్ట్ (ఐఎస్‌టీఆర్) పేరిట విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఈ విధానంలో క్రిప్టోకరెన్సీ (బిట్‌కాయిన్) లావాదేవీలు నిర్వహించే వారినే లక్ష్యంగా చేసుకొని వారి కంప్యూటర్లను తమ అధీనంలోకి తెచ్చుకోవడం గత ఏడాది కాలంలో దాదాపు 85 రెట్లు ఎక్కువైందని తెలిపింది.


క్రిప్టోజాకింగ్ అంటే?
మొబైల్, పీసీ, ట్యాబ్లెట్ లేదా ఇంటర్నెట్ ఆధారిత(ఐఓటీ) పరికరాల ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని హైజాక్ చేయడాన్ని క్రిప్టోజాకింగ్ అంటారు. ఫలితంగా కంప్యూటర్లు పనిచేసే వేగం గణనీయంగా తగ్గిపోతుంది. కొన్నిసార్లు నెట్‌వర్క్ మొత్తం సమస్యలకు గురవుతుంది. దీనిని వాడుకొని హ్యాకర్లు క్రిప్టోకరెన్సీని పొందుతారు.


జీశాట్-6ఏ ప్రయోగం విజయవంతంభారత సమాచార వ్యవస్థకు మరింత సాంకేతికతను జోడించేందుకు మార్చి 29న ప్రయోగించిన జీశాట్6-ఏ విజయవంతమైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జీఎస్‌ఎల్‌వీ ఎఫ్08 వాహకనౌక, 2,140 కిలోలు బరువు కలిగిన జీశాట్ 6ఏ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ విజయంతో క్రయోజనిక్ దశ (పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారు) ద్వారా చేసిన ప్రయోగాల్లో వరుసగా ఆరోవిజయాన్ని ఇస్రో నమోదు చేసింది. జీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో చేసిన 12 ప్రయోగాల్లో ఇది తొమ్మిదో విజయం. షార్‌నుంచి 63వ ప్రయోగం.

ప్రయోగం జరిగిందిలా..49.1 మీటర్ల పొడవు, 415.6 టన్నులున్న జీఎస్‌ఎల్‌వీ ఎఫ్08 మొదటి దశలో 4 స్ట్రాపాన్ బూస్టర్లు, కోర్ అలోన్ ఉన్నాయి. ఒక్కో స్ట్రాపాన్ బూస్టర్‌లో 42.7 టన్నుల ద్రవ ఇంధనం లెక్కన నాలుగు స్ట్రాపాన్ బూస్టర్లలో 170.8 టన్నుల ద్రవ ఇంధనంతో పాటు కోర్ అలోన్ దశలో 138.11 ఘన ఇంధనంతో 151 సెకన్లలో మొదటి దశను విజయవంతంగా పూర్తి చేసింది. 39.48 టన్నుల ద్రవ ఇంధనం సాయంతో 285 సెకన్లలో రెండోదశను, ఆ తరువాత మూడో దశ (క్రయోజనిక్ దశ) ను 12.84 టన్నుల క్రయోజనిక్ ఇంధనం సాయంతో 1,065 సెకన్లలో పూర్తి చేసింది. మొత్తం 25 నిమిషాల పాటు ప్రయాణించి ఉపగ్రహాన్ని భూమికి సమీప కక్ష్య అయిన పెరిజీ 170 కిలోమీటర్లు, సుదూర కక్ష్య అయిన అపోజీ 35,975 కిలోమీటర్ల ఎత్తులో వదిలిపెట్టింది. అనంతరం హసన్‌లో ఉన్న మాస్టర్ కంట్రోల్ సెంటర్ వారు ఉపగ్రహాన్ని అధీనంలోకి తీసుకున్నారు.

జీశాట్ 6ఏ ప్రయోజనాలుజీశాట్-6ఏ సమాచార ఉపగ్రహ ప్రయోగంతో డిజిటల్ మల్టీ మీడియా, మొబైల్ కమ్యూనికేషన్ రంగంలో అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుంది. జీశాట్ 6ఏ ఉపగ్రహంలో 5ఎస్ బ్యాండ్ స్పాట్ బీమ్స్, ఒక సీబ్యాండ్ బీమ్ అమర్చారు. ఆరు చదరపు మీటర్లు వ్యాసార్థం కలిగిన అన్‌ఫర్‌లేబిల్ యాంటెన్నాతో యూజర్ కమ్యూనికేషన్ లింక్, 0.8 చదరపు మీటర్లు ఫిక్స్‌డ్ యాంటెన్నా ద్వారా హబ్ కమ్యూనికేషన్ లింక్ అందుబాబులోకి వస్తుంది. ఇందులోని భారీ యాంటెన్నా భారతదేశమంతా పూర్తిస్థాయిలో విస్తరిస్తూ అయిదు పుంజాలతో పనిచేస్తుంది. సాధారణంగా ఇస్రో రూపొందించే ఆంటెన్నా కంటే ఇది మూడు రెట్లు పెద్దది.

ఎస్ బ్యాండ్ అంటేఎస్ బ్యాండ్ అనేది విద్యుదయాస్కాంత స్పెక్ట్రమ్‌లో ఒక భాగం. 2 నుంచి 4 గిగా హెర్ట్జ్ పౌనపున్యాల మధ్య నడిచే ఈ బ్యాండ్ వాతావరణానికి సంబంధించిన అన్ని రాడార్లు, నౌకలు, కొన్ని కమ్యూనికేషన్ ఉపగ్రహాల్లో వాడుతున్నారు. 2.5 జీహెచ్‌జెడ్‌ను ప్రపంచవ్యాప్తంగా 4జీ సేవలకు వినియోగిస్తున్నారు.


జీశాట్-6ఏ కక్ష్య దూరం పెంపు
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో జీఎస్‌ఎల్‌వీ ఎఫ్08 ద్వారా మార్చి 29 న ప్రయోగించిన జీశాట్ 6ఏ ఉపగ్రహ మొదటి విడత కక్ష్య దూరాన్ని శాస్త్రవేత్తలు విజయవంతంగా పొడిగించారు. ఈ రాకెట్ ద్వారా జీశాట్ 6ఏ ఉపగ్రహాన్ని పెరిజీ (భూమికి దగ్గరగా) 170 కిలోమీటర్లు, అపోజీ (భూమికి దూరంగా) 35,975 కిలోమీటర్ల ఎత్తులో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం బెంగళూరులోని ఉపగ్రహాల నియంత్రణ కేంద్రం శాస్త్రవేత్తలు పెరిజీని 36 వేల కిలోమీటర్ల ఎత్తుకు పెంచే ప్రక్రియను దశల వారీగా చేపడుతున్నారు.


భూమిపై కూలిపోనున్న చైనా అంతరిక్ష కేంద్రం
చైనాకు చెందిన అంతరిక్ష కేంద్రం నిరుపయోగంగా మారి, నియంత్రణ కోల్పోవడంతో త్వరలోనే భూమిపై కూలిపోనుంది. టియాంగంగ్-1 (స్వర్గ సౌధం) అనే అంతరిక్ష కేంద్రం ఏప్రిల్ 2న ఆస్ట్రేలియా నుంచి అమెరికా మధ్యలో ఎక్కడైనా పడొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
టియాంగంగ్-1ను చైనా 2011లో ప్రయోగించింది. దీని జీవితకాలం రెండేళ్లు. 2013 జూన్ కల్లా ఇది తన ప్రధాన పనులను పూర్తి చేసింది. 2016లో పనిచేయడం మానేసి కొద్దికొద్దిగా కక్ష్య నుంచి పక్కకు జరుగుతూ వస్తోంది. ‘టియాంగంగ్-1 అంతరిక్ష కేంద్రం భూమివైపుకు వస్తోంది. ఆదివారం మధ్యాహ్నానికి అది భూవాతావరణానికి 179 కి.మీ. దూరంలో ఉంది’ అని చైనా మ్యాన్‌‌డ స్పేస్ ఏజెన్సీ చెప్పింది.


'జీశాట్-6ఏ’ తో తెగిపోయిన సంబంధాలుదేశ సమాచార వ్యవస్థను మరింత పటిష్టపరిచేందుకు చేపట్టిన జీశాట్-6ఏ ఉపగ్రహంతో బెంగళూరు సమీపంలోని హసన్‌లో ఉన్న ఉపగ్రహాల నియంత్రణ కేంద్రం(మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ)తో సంబంధాలు తెగిపోయాయి. ఉపగ్రహ కక్ష్య దూరాన్ని పెంచే క్రమంలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా నియంత్రణ కోల్పోయి సంబంధాలు తెగిపోయినట్లు ఇస్రో ప్రకటించింది.
మార్చి 30, 31 తేదీల్లో మొదటి, రెండో విడత ఉపగ్రహ కక్ష్య దూరాన్ని ఉపగ్రహంలో ఇంధనాన్ని మండించి విజయవంతంగా పొడిగించారు. ఏప్రిల్ 2న మూడో విడత కక్ష్య దూరం పెంపులో భాగంగా ఉపగ్రహాన్ని భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఉపగ్రహంలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ జరిగి సిగ్నల్స్ ఆగిపోయాయి. 


పసిఫిక్ మహాసముద్రంలో కూలిన టియాంగంగ్
చైనాకు చెందిన అంతరిక్ష ప్రయోగ కేంద్రం టియాంగంగ్-1 పసిఫిక్ మహా సముద్రంలో కూలిపోయింది. ఏప్రిల్ 1న ఉదయం 5.45 గంటలకు (భారత కాలమానం) టియాంగంగ్-1 దక్షిణ పసిఫిక్ మహా సముద్రంలో కూలినట్లు చైనా అధికారులు వెల్లడించారు. టియాంగంగ్ వల్ల ఎవ్వరికీ హాని జరగలేదనీ, నియంత్రణ కోల్పోయిన స్కైలాబ్ భూ వాతావరణంలోకి ప్రవేశించిన వెంటనే వేడికి దాదాపుగా దగ్ధమైపోయినట్లు చైనాలోని మ్యాన్‌‌డ స్పేస్ ఇంజనీరింగ్ ఆఫీస్ తెలిపింది. 
సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలన్న ఆలోచనలో భాగంగా చైనా టియాంగంగ్-1ను 2011 సెప్టెంబరులో అంతరిక్షంలోకి పంపింది. దీని జీవితకాలం రెండేళ్లు. మొత్తం ఆరుగురు వ్యోమగాములు (ఇద్దరు స్త్రీలు, నలుగురు పురుషులు) టియాంగంగ్‌లో పనిచేశారు. 2013 కల్లా ఇది తన ప్రధాన పనులను పూర్తి చేసినప్పటికీ దీని సేవలను చైనా పొడిగించింది. 2016లో ఇది పూర్తిగా పనిచేయడం మానేసి, నియంత్రణను కోల్పోయి కక్ష్య నుంచి పక్కకు జరగడం ప్రారంభించింది.


సుదూర నక్షత్రాన్ని గుర్తించిన నాసా
విశ్వంలోని అనంత దూరంలో అతి పెద్దదైన నీలం రంగు నక్షత్రాన్ని హబుల్ టెలిస్కోప్ గుర్తించినట్లు నాసా ఏప్రిల్ 3న ప్రకటించింది. ఈ నక్షత్రానికి ఇకరస్‌గా నామకరణం చేసింది. భూమి నుంచి 9 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలోని నక్షత్ర మండలంలో దీనిని గుర్తించారు. గురుత్వాకర్షణ లెన్సింగ్ ఆధారంగా ఈ నక్షత్రాన్ని పెద్దదిగా చేసి కాంతిని పరిశీలించారు.
విశ్వంలో పెద్ద సమూహాల నక్షత్ర మండలాల గురుత్వాక్షరణ శక్తి సాధారణ లెన్‌‌సగా పని చేసినప్పుడు కాంతిని వంచడం వల్ల గురుత్వాక్షరణ లెన్సింగ్ ఏర్పడుతుంది. ఈ గురుత్వాక్షరణ శక్తితో పాటు హబుల్ టెలిస్కోప్ సామర్థ్యాన్ని కలిపి ఈ నక్షత్రాన్ని అధ్యయనం చేశారు.

ఖండాంతర క్షిపణి సర్మత్‌ను పరీక్షించిన రష్యా
అధునాతన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి(ఐసీబీఎం) సర్మత్‌ను విజయవంతంగా పరీక్షించినట్లు రష్యా సైన్యం మార్చి 30న ప్రకటించింది. ప్రపంచంలోనే అత్యంత భారీ ఐసీబీఎంగా పేరొందిన వొయేవోడా(సాతాన్) స్థానంలో సర్మత్‌ను ప్రవేశపెట్టనున్నారు. దీని బరువు 200 టన్నులు.





మార్చి 2018 సైన్స్ & టెక్నాలజీ

స్వదేశీ సీకర్‌తో 'బ్రహ్మోస్' పరీక్ష విజయవంతం ::
అత్యాధునిక బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణులకు అనువైన ఆర్‌ఎఫ్ సీకర్ల తయారీలో భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) శాస్త్రవేత్తలు విజయం సాధించారు. రాజస్తాన్‌లోని పోఖ్రాన్ టెస్ట్‌రేంజ్‌లో మార్చి 22న ఈ సీకర్లను అమర్చిన బ్రహ్మోస్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు. క్షిపణులు తమ లక్ష్యాన్ని కచ్చితత్వంతో గుర్తించడంలో ఈ సీకర్లు అత్యంత కీలకమైనవి. హైదరాబాద్ శివార్లలో ఉన్న డీఆర్‌డీవో కేంద్రంలో తయారైన ఈ సీకర్లను తొలిసారి బ్రహ్మోస్ క్షిపణిలో ప్రయోగించి మంచి ఫలితాలు రాబట్టారు. 
మూడు నెలల క్రితం ఈ క్షిపణులను సుఖోయ్ -30 యుద్ధవిమానాల ద్వారా విజయవంతంగా పరీక్షించారు. 2.5 టన్నుల బరువుతో 8.4 మీటర్ల పొడవుండే బ్రహ్మోస్ 300 కేజీల వార్‌హెడ్లను మోసుకుపోగలదు. భూమి, సముద్రం, ఆకాశం నుంచి ప్రయోగించగల ఈ క్షిపణి 290 కి.మీ పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు. గంటకు 3457.44 కి.మీ(2.8 మ్యాక్) వేగంతో దూసుకెళ్లే ఈ క్షిపణిని గంటకు 6,174 కి.మీ(5 మ్యాక్) వేగంతో వెళ్లేలా ఇటీవల అప్‌గ్రేడ్ చేశారు. గతేడాది భారత్ మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్(ఎంటీసీఆర్)లో చేరిన నేపథ్యంలో బ్రహ్మోస్ పరిధిని 400 కిలోమీటర్లకు పెంచడంపై శాస్త్రవేత్తలు ప్రస్తుతం దృష్టి సారించారు. 


శక్తిమంతమైన క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసిన పాక్ :: 

శత్రు దేశాల క్షిపణులను గుర్తించి ధ్వంసం చేసేందుకు పాకిస్తాన్ చైనా నుంచి అత్యంత శక్తిమంతమైన క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసినట్లు తెలిసింది. బహుళ వార్‌హెడ్లను మోసుకెళ్లే క్షిపణుల అభివృద్ధికి నాలుగు టెలిస్కోపులతో కూడిన అత్యాధునికమైన ఈ వ్యవస్థ దోహదపడుతుందని భావిస్తున్నారు. కొత్త క్షిపణులను పరీక్షించేందుకు, అభివృద్ధి చేసేందుకు పాకిస్తాన్ ఇప్పటికే దీన్ని రహస్య ప్రదేశంలో వినియోగంలోకి తెచ్చినట్లు వెల్లడైంది. చైనీస్ అకాడమీ ఆఫ్ సెన్సైస్ (సీఏఎస్) పరిశోధకుడు ఒకరిని ఉటంకిస్తూ హాంకాంగ్ కేంద్రంగా పనిచేస్తున్న సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ మార్చి 22న ఈ విషయాలను కథనం రూపంలో ప్రచురించింది. అయితే పాకిస్తాన్ ఈ కొనుగోలు ఒప్పందానికి ఎంత వెచ్చించిందో వెల్లడించలేదు. అత్యాధునిక క్షిపణి నిఘా వ్యవస్థను పాకిస్తాన్‌కు చైనా అమ్మినట్లు సీఏఎస్ పరిశోధకుడు జెంగ్ మెంగ్వెయ్ రూఢీ పరచినట్లు ఆ పత్రిక పేర్కొంది. 

బ్లాక్‌హోల్‌కు స్టీఫెన్ హాకింగ్‌గా నామకరణం ::  
తన జీవితమంతా అంతరిక్ష పరిశోధనలకు కేటాయించి, బ్లాక్‌హోల్స్(కృష్ణబిలం) గురించి ఎన్నో విషయాలను ప్రపంచానికి తెలియజెప్పిన ప్రఖ్యాత బ్రిటిష్ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హకింగ్ పేరును ఓ బ్లాక్‌హోల్‌కు పెట్టారు. ఈ బ్లాక్‌హోల్‌ను హాకింగ్ మరణించిన రెండు రోజుల తర్వాతే గుర్తించిన రష్యన్ వ్యోమగాములు.. సదరు కృష్ణబిలానికి 'స్టీఫెన్ హాకింగ్'గా నామకరణం చేశారు. 
కొత్తగా కనిపెట్టిన బ్లాక్‌హోల్ ఓఫికస్ నక్షత్రాలు కూటమిలో ఉందని మాస్కో స్టేట్‌యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. వీరు కొంతకాలంగా నక్షత్రాల కూటమిలో గామా కిరణాల పేలుళ్లను(జీఆర్‌బీ) పరిశీలిస్తున్నారు. నక్షత్రం కూలిపోవటం వల్లే పేలుడు సంభవించిందని, దాని స్థానంలో బ్లాక్ హోల్ ఏర్పడటానికి పరిస్థితులు దారితీశాయని వెల్లడించారు. గామా-రే పేలుళ్లు చాలా శక్తిమంతమైన పేలుళ్లని, సుదూరంలో ఉన్న గెలాక్సీలను కూడా అవి మింగేస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. పేలుళ్ల సమయంలో విడుదలయ్యే శక్తిని టెలిస్కోపు ద్వారా బంధించడం కూడా దాదాపు అసాధ్యమని, కానీ రష్యన్ వ్యోమగాములు ఈ దృశ్యాన్ని బంధించారని వివరించారు. ఈ శక్తివంతమైన పేలుళ్లను స్పెయిన్ దేశంలోని టెనెరిఫ్ ఐలాండ్‌లో ఏర్పాటు చేసిన మాస్టర్-ఐఏసీ రోబోటిక్ టెలిస్కోప్ ద్వారా చిత్రీకరించారు. దీనిపై పరిశోధన కొనసాగించేందుకు స్టీఫెన్ హాకింగ్ సూచనలు ఎంతగానో ఉపయోగపడతాయని భావించినందునే ఆయన పేరును పెట్టారు. అలాగే.. ఈ ఆవిష్కరణను జీఆర్‌బీ180316ఏ పేరుతో రిజిస్టర్ చేశారు.

వేగవంతమైన విమానాన్ని అభివృద్ధి చేస్తున్న చైనా  :: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన, బీజింగ్ నుంచి న్యూయార్క్‌కు రెండు గంటల్లోనే చేరుకోగల విమానాన్ని చైనా అభివృద్ధి చేస్తోంది. దీనిని పరీక్షించేందుకు ధ్వని వాయు సొరంగం (హైపర్‌సోనిక్ విండ్ టన్నెల్)ను చైనా నిర్మిస్తోందని ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది. వాహనాలు రోడ్డుపైన, విమానాలు ఆకాశంలో వెళ్తున్నప్పుడు గాలి బలంగా వీస్తుండటం తెలిసిందే. కొత్తగా తయారైన వాహనాలు, విమానాలు తదితరాలపై అలా వీచే గాలి ప్రభావం ఎలా ఉంటుందో పరీక్షించడానికి ఏరోడైనమిక్స్ పరిశోధనల్లో వాయు సొరంగాలను ఉపయోగిస్తారు. ఇప్పుడు చైనా అభివృద్ధి చేస్తున్న కొత్త విమానం ధ్వని వేగానికి 25 రెట్ల అధిక వేగం (మ్యాక్ 25)తో ప్రయాణించగలదు. సాధారణ లెక్కల్లో చెప్పాలంటే గంటకు ఏకంగా 30,625 కిలోమీటర్ల వేగంతో ఇది ఆకాశంలో దూసుకుపోగలదు. అంత వేగంతో వెళ్తున్నప్పుడు దీనిపై గాలి ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఆ పరిస్థితిని కృత్రిమంగా వాయుసొరంగంలో కల్పించి విమానాన్ని పరీక్షిస్తారు. అందుకోసమే చైనా ఈ 265 మీటర్ల పొడవైన సొరంగాన్ని నిర్మిస్తోంది. 


ఇంటర్నెట్ వేగంలో చెన్నై టాప్ :: 
దేశంలో ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌ను వాడుతున్న నగరాల్లో..చెన్నై అత్యంత వేగవంతమైన నెట్ స్పీడ్ లభిస్తున్న నగరంగా నిలిచింది. కాగా, రెండో స్థానంలో బెంగళూరు; మూడో స్థానంలో హైదరాబాద్; నాలుగో స్థానంలో విశాఖపట్నం నిలిచాయి. అమెరికాలోని సీటెల్ కేంద్రంగా పనిచేస్తున్న ఊక్లా సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ వేగాన్ని గణించింది. దీనికి సంబంధించిన నివేదికను మార్చి 13న విడుదల చేసింది. ఇందులో ఇంటర్నెట్ వేగం పరంగా భారత్‌కు 67వ స్థానం లభించడం గమనార్హం.

చంద్రుడిపై 4జీ సేవలకు ప్రయత్నాలు :: 4జీ నెట్‌వర్క్‌ను చంద్రమండలానికి విస్తరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నాసాకు చెందిన వ్యోమగాములు చంద్రుని ఉపరితలంపై నడిచి.. దాదాపు 50ఏళ్ల పూర్తవుతున్న నేపథ్యంలో.. 2019లో చంద్రునిపై 4జీ కవరేజ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు జర్మనీకి చెందిన దిగ్గజ టెలికాం సంస్థ వొడాఫోన్ సన్నాహాలు చేస్తోంది. టెక్నాలజీ పార్ట్‌నర్‌గా నోకియాతో ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంది. ప్రైవేట్ రంగంలో బెర్లిన్‌కు చెందిన పీటీ స్పేస్ కంపెనీ సైంటిస్టుల సహకారంతో వొడాఫోన్, నోకియా ప్రైవేట్ భాగస్వామ్యంతో తొలిసారి చందమామపై ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. మిషన్ మూన్‌లో భాగంగా 2019లో కేప్ కెనవరాల్ నుంచి స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ప్రయోగం చేపట్టనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకు ల కోసం తొలిసారి లైవ్-స్ట్రీమింగ్ ద్వారా హెచ్‌డీ వీడియోను ప్రసారం చేసి, ప్రత్యేక అనుభూతి కల్పిస్తామని కూడా వొడాఫోన్ ప్రకటించింది. 


భారీ సౌర విద్యుదుత్పత్తి కేంద్రం ప్రారంభం :: 
కర్ణాటకలోని తుమకూరు జిల్లా పావగడ సమీపంలోని భారీ సౌర విద్యుదుత్పత్తి కేంద్రం మొదటి దశను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 2018, మార్చి 1న ప్రారంభించారు. ఈ కేంద్రం సామర్థ్యం 2,000 మెగావాట్లు. రూ.16,500 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ సౌర పార్‌‌క మొదటి దశలో 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని లాంఛనంగా ప్రారంభించింది.







ఫిబ్రవరి 2018 సైన్స్ & టెక్నాలజీ

సైనిక లాంఛనాలతో వజ్రకు వీడ్కోలు 
దాదాపు 30 ఏళ్లకుపైగా తీరరక్షణ విధులు నిర్వర్తించిన వజ్ర నౌకకు సైనిక లాంఛనాలతో వీడ్కోలు పలికారు. పారాదీప్‌లో ఫిబ్రవరి 21న జరిగిన వీడ్కోలు కార్యక్రమంలో గార్డ్ ఆఫ్ ఆనర్ అనంతరం నౌకపై రెపరెపలాడిన ధ్వజాన్ని అవనతం చేశారు. మేజగాన్ డాక్‌యార్డ్‌లో పురుడుపోసుకున్న ఈ నౌకకు ఇంద్రుడి ఆయుధమైన వజ్రాయుధం పేరును పెట్టారు. 1988, డిసెంబర్ 22న ఇది నేవీలోకి ప్రవేశించింది. పారాదీప్ తీరరక్షణ విభాగంలోకి 2013, ఏప్రిల్ 11న ప్రవేశించి, నిర్విరామంగా సేవలందించింది. 


పశ్చిమ టెక్సాస్‌లో 10,000 ఏళ్ల భారీ గడియారం
అమెరికాలోని పశ్చిమ టెక్సాస్ పర్వతాల్లో 10,000 సంవత్సరాల వరకూ పనిచేసే భారీ గడియారాన్ని(క్లాక్‌ఆఫ్ లాంగ్ నౌ) రూపొందిస్తున్నట్లు ఆన్‌లైన్ మార్కెటింగ్ దిగ్గజం అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ తెలిపారు. దాదాపు 500 అడుగులు ఎత్తుండే ఈ గడియారానికి భూమి థర్మో సైకిల్స్ ఆధారంగా శక్తి చేకూరుతుందని వెల్లడించారు. ఈ ప్రాజెక్టుపై గత 30 ఏళ్లుగా పనిచేస్తున్నామనీ, ప్రస్తుతం టెక్సాస్ కొండల్లో ఈ గడియారాన్ని అమర్చే ప్రక్రియ శరవేగంగా సాగుతోందని పేర్కొన్నారు. 
అమెరికాకు చెందిన డ్యాని హిల్లీస్ 1989లో భారీ గడియారాన్ని నిర్మించాలన్న ఆలోచన చేశారు. జెఫ్ బిజోస్ చేరికతో భారీ గడియారం ప్రాజెక్టు వాస్తవరూపం దాల్చింది. అమెరికాలోని టెక్సాస్ కొండల్లో రూ.272.20 కోట్లతో నిర్మిస్తున్న ఈ భారీ గడియారంలో సమయాన్ని అత్యంత కచ్చితత్వంతో లెక్కించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతిరోజూ మధ్యాహ్నం సూర్యకాంతి సాయంతో ఈ గడియారం తన సమయాన్ని సరిచేసుకుంటుంది. ఈ గడియారం సమయాన్ని గ్రెగొరియన్ పద్ధతిలో, 5 అంకెల రూపంలో తెలుపుతుంది. అంటే 2018ని ఈ గడియారం 02018గా సూచిస్తుంది. ఇందులోని ఓ ముల్లు ఏడాదికోసారి మాత్రమే కదిలితే.. మరో ముల్లు ప్రతి వందేళ్లకోసారి మాత్రమే ముందుకెళ్తుంది. ప్రతి 1,000 ఏళ్లకు ఓసారి కూకూ(పక్షిలాంటి నిర్మాణం) బయటికొచ్చేలా ఈ గడియారంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అత్యంత కచ్చితత్వంతో పనిచేసేలా రూపొందించడంతో ప్రతి 20 వేల ఏళ్లలో ఒకరోజు మాత్రమే తేడా వస్తుంది. ఈ భారీ గడియారానికి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. వచ్చే 10,000 ఏళ్ల పాటు ప్రతిరోజూ మధ్యాహ్నం ఈ గడియారంలో గంట మోగుతుంది. అయితే ఓసారి మోగిన గంట స్వరం వచ్చే 10 వేల ఏళ్లలో ఎన్నడూ పునరుక్తి కాకుండా దీని రూపకర్తలు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. 


ధనుష్’ ప్రయోగం సక్సెస్ 
అణ్వాయుధాలను మోసుకుపోగల సామర్థ్యం కలిగిన బాలిస్టిక్ క్షిపణి ధనుష్ పరీక్ష విజయవంతమైంది. ఒడిశా తీరంలోని భారత నావికా దళానికి చెందిన ఓ నౌక ద్వారా ధనుష్‌ను పరీక్షించారు. 350 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఇది విజయవంతంగా ఛేదించినట్టు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. భూ ఉపరితలం నుంచి భూ ఉపరితలంపై లక్ష్యాలను ఛేదించగల పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన పృథ్వీ క్షిపణిని నావికా దళ అవసరాల కోసం అభివృద్ధి పరిచి ధనుష్ క్షిపణిగా రూపొందించారు. ఈ క్షిపణిని ఫిబ్రవరి 23న బంగాళాఖాతంలో పారాదీప్ దగ్గర్లోని ఓ నౌక ద్వారా విజయవంతంగా ప్రయోగించినట్టు అధికారులు చెప్పారు. ధనుష్ క్షిపణి 500 కిలోల పేలుడు పదార్థాలను మోసుకుపోగలదు. భూ, సముద్ర తలంలోని లక్ష్యాలను ఛేదించగలదు. ధనుష్ ఇప్పటికే భారత రక్షణ బలగాల్లో చేరింది. 


తేజస్ కీలక పరీక్ష విజయవంతం
స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన తేలికపాటి యుద్ధవిమానం (ఎల్‌సీఏ) ‘తేజస్’ మరో కీలక పరీక్షను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఫిబ్రవరి 26న హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్) ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరిన తేజస్ ఎల్‌ఎస్‌పీ8 విమానం తిరిగి సురక్షితంగా చేరుకోవటంతోపాటు, ఇంజిన్ ఆన్‌లో ఉండగానే ఇంధనం నింపుకుంది. ఇలాంటి సదుపాయం ఉన్న భారత వైమానిక దళ విమానాల్లో తేజస్ మొట్టమొదటిదని హాల్ తెలిపింది. తేజస్‌కు ఉన్న ఈ సౌలభ్యంతో ఇంధనం నింపుకునే సమయం సగానికి సగం తగ్గిపోతుందని వివరించింది. 

తమిళనాడుకు తొలి డిఫెన్స్ కారిడార్
దేశంలోనే తొలి డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్‌ను తమిళనాడులో అభివృద్ధి చేసే ప్రక్రియను కేంద్రం ప్రారంభించింది. చెన్నై, హొసూర్, కోయంబత్తూర్, సేలం, తిరుచిరాపల్లిలను కలుపుతూ ఈ డిఫెన్‌‌స కారిడార్ ఉండనుంది. ఈ ప్రాజెక్టుకు ప్రస్తుతం అధికారులు తుదిరూపునిస్తున్నారు. దేశంలో రెండు డిఫెన్‌‌స ఇండస్ట్రియల్ కారిడార్లను నెలకొల్పుతామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. మరో కారిడార్‌ను బుందేల్‌ఖండ్ ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ గత వారమే ప్రకటించారు. 

రాత్రి వేళలో పృథ్వీ-2 పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన పృథ్వీ-2 క్షిపణిని రాత్రి వేళ విజయవంతంగా పరీక్షించారు. ఒడిశాలోని చాందీపూర్ సమీకృత పరీక్షా వేదిక(ఐటీఆర్) నుంచి ఫిబ్రవరి 21న రాత్రి 8.30 గంటలకు క్షిపణిని ప్రయోగించగా..లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదించింది.

రుస్తుం-2 పరీక్ష విజయవంతం
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మానవ రహిత విమానం.. రుస్తుం-2 వైమానిక పరీక్షలను విజయవంతంగా చూర్తి చేసుకుంది. శాస్త్రవేత్తలు కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో ఫిబ్రవరి 25న ఈ పరీక్షలను నిర్వహించారు.

హైదరాబాద్‌లో డేటా సైన్స్ కేంద్రం
డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) విభాగాల్లో పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించేలా హైదరాబాద్‌లో ‘సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’ను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, నాస్కామ్ మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది.

మార్స్‌పై చారలను గుర్తించిన ఆపర్చునిటీ రోవర్ అరుణగ్రహం (మార్స్)పై శోధించేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయోగించిన రోవర్ ఆపర్చునిటీ ఓ కొత్త విషయాన్ని గుర్తించింది. అక్కడ రాళ్లపై చారలను కనుగొంది. ఈ చారలకు భూమిపై ఉన్న కొన్ని పర్వతాలపై మట్టి తరచూ గడ్డకట్టడం, కరిగిపోవడం వల్ల ఏర్పడే చారలతో పోలి ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఈ చారలు కొన్నిసార్లు గాలి వీయడం, పై నుంచి నీరు పారడం వంటి కారణాలతో కూడా ఏర్పడతాయని పేర్కొంటున్నారు. ఈ రోవర్ 2004 జనవరిలో అరుణగ్రహంపై అడుగుపెట్టింది. ఇప్పటివరకు ఇది 5 వేల అరుణగ్రహం రోజులను పూర్తి చేసుకుంది. అక్కడ అడుగు పెట్టినప్పటి నుంచి ఓ లోయలో అన్వేషణ సాగిస్తోందని అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన అర్వింద్‌సన్ రాయ్ తెలిపారు. 


హాక్-ఐకి స్వదేశీ చోదక వ్యవస్థదేశంలోనే తొలిసారిగా రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ (ఆర్టీవోఎస్)తో రూపొందిన హాక్-ఐ యుద్ధ శిక్షణ విమానాన్ని హెచ్‌ఏఎల్ తొలిసారిగా పరీక్షించింది. ఆర్టీవోఎస్‌ను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో హెచ్‌ఏఎల్ తయారుచేసింది. ఈ విమానాలను యుద్ధ అవసరాలకు, శిక్షణకు ఉపయోగించుకోవచ్చు. బ్రిటన్ మాతృకగా గల ఈ విమానాల్లో భారత్ తన అవసరాలకు తగినట్లుగా ఆర్టీవోఎస్‌ను నిక్షిప్తం చేసింది. ఇది ఫిబ్రవరి 7న విజయవంతంగా గగనవిహారం చేసింది. ఇందులో పొందుపరిచిన ప్రోగ్రామ్‌లను చాలా కచ్చితత్వంతో అమలు చేయడం ఈ విమానం ప్రత్యేకత. 


పృథ్వీ-2 క్షిపణి ప్రయోగం విజయవంతం 
పూర్తి దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన పృథ్వీ-2 క్షిపణిని భారత సైన్యం విజయవంతంగా పరీక్షించిందని సైనిక వర్గాలు వెల్లడించాయి. ‘ఉపరితలం నుంచి ఉపరితలంలోకి’ ప్రయోగించే ఈ క్షిపణి 350 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదిస్తుంది. ఫిబ్రవరి 7న ఒడిశాలోని బాలసోర్‌లో సమీపంలో ఉన్న చాందీపూర్‌లోని ఇంటిగ్రేటేడ్ టెస్ట్ రేంజ్ మూడో వేదికపై మొబైల్ లాంచర్ సాయంతో ఈ క్షిపణిని ప్రయోగించారు. 500 నుంచి 1000 కిలోగ్రాముల వార్‌హెడ్‌‌సను పృథ్వీ-2 రెండు ఇంజిన్లతో సునాయాసంగా తీసుకెళ్లగలదు. ఈ ప్రయోగ గమనాన్ని డీఆర్‌డీవో రాడార్లు, ఎలక్ట్రో ఆప్టిక్ ట్రాకింగ్ వ్యవస్థతో పాటు ఒడిశా తీరం వెంబడి ఉన్న టెలీమెట్రీ స్టేషన్ల సాయంతో పర్యవేక్షించారు. 


ఫాల్కన్ హేవీ రాకెట్ ప్రయోగం విజయవంతం 
ప్రపంచంలో పేరుగాంచిన అంతరిక్ష పరిశోధనా సంస్థలకు సాధ్యంకాని ప్రయోగాన్ని ప్రైవేట్ సంస్థ ‘స్పేస్ ఎక్స్’(స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ టెక్నాలజీస్ కార్పొరేషన్) సుసాధ్యం చేసింది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా పరీక్షించింది. నిప్పులు విరజిమ్ముతూ అంతరిక్షంలోకి దూసుకెళ్లిన ఫాల్కన్ హెవీ రాకెట్.. స్పేస్ ఎక్స్ సంస్థ సీఈవో ఎలన్ మస్క్‌కు చెందిన టెస్లా రోడ్‌స్టర్ కారును అంగారకుడి దగ్గరి కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఫాల్కన్ హెవీ రాకెట్‌లో అమర్చిన 27 ఇంజిన్లను మండించడం ద్వారా రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. 

కక్ష్య తప్పి.. సౌరవ్యవస్థలో షి‘కారు’.. 
తొలుత ప్రయోగం విజయవంతమైనట్లేనని శాస్త్రవేత్తలు, సంస్థ ప్రతినిధులు భావించారు. అయితే ఫాల్కన్ హెవీ రాకెట్ కారును ప్రవేశపెట్టాల్సిన నిర్ణీత కక్ష్యలో కాకుండా అంగారకుడి అవతల ఆస్టరాయిడ్ ప్రభావిత ప్రాంతంలో విడిచిపెట్టిందని ఎలన్ మస్క్ తెలిపారు. ఒకవేళ కారు సౌరవ్యవస్థ ప్రభావిత ప్రాంతంలోకి ప్రవేశిస్తే సూర్యుడి కాస్మిక్ కిరణాలు తగిలి కారు ముక్కలవుతుంది. 

ఫాల్కన్ హెవీ ప్రత్యేకతలు: 
ఫాల్కన్ హెవీ రాకెట్‌ను మూడు చిన్న ఫాల్కన్ 9 రాకెట్లను కలిపి రూపొందించారు. అంతేకాకుండా పునర్వినియోగించుకోగలగడం దీని ప్రత్యేకత. 230 అడుగుల ఎత్తు ఉండే ఫాల్కన్ హెవీ రాకెట్ సుమారు 64 మెట్రిక్ టన్నుల బరువును కక్ష్యలోకి ప్రవేశపెట్టగల సామర్థ్యముంది. ఇది నిండుగా నింపిన 737 జెట్‌లైనర్ల బరువుతో సమానం. అయితే ఫాల్కన్ హెవీ కంటే శాటర్న్ వీ రాకెట్ అత్యధిక బరువును మోసుకెళ్లగలదు. ప్రసుతానికై తే అంతరిక్ష రంగంలో ఫాల్కన్ హెవీ ప్రయోగం అతిపెద్దది. తొలుత ఫాల్కన్ హెవీని చంద్రుడు, అంగారకుడిపైకి మనుషులను పంపాలన్న ఉద్దేశంతో ప్రారంభించామని, అయితే ప్రస్తుతానికి ఈ ఆలోచనలు విరమించుకున్నామని ఎలన్ మస్క్ చెప్పారు. దీని ద్వారా సుదూర అంతరిక్ష ప్రాంతాలను చేరుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.

న్యూ హారిజాన్‌‌స స్పేస్ క్రాఫ్ట్ సరికొత్త చరిత్ర 
నాసాకు చెందిన న్యూ హారిజాన్‌‌స స్పేస్‌క్రాఫ్ట్ సరికొత్త చరిత్ర సృష్టించింది. మానవ చరిత్రలో గతంలో ఎన్నడూ సాధించని రికార్డును తన పేరిట నమోదుచేసింది. సౌరకుటుంబంలో చివరిగా ఉంటూ.. కొన్నేళ్ల కిందట గ్రహం హోదా కోల్పోయిన ప్లూటో గురించి ఇప్పటికే ఎంతో సమాచారం అందించిన ఘనత ఈ న్యూ హారిజాన్‌‌స సొంతం. కాగా తాజాగా భూమికి సుదూరాన ఉన్న నక్షత్ర మండలి ఫొటోలను తీసి కొత్త రికార్డు సృష్టించింది. భూమికి 1,300 కాంతి సంవత్సరాల దూరంలో క్యూపర్ బెల్ట్‌లోని నక్షత్ర సమూహానికి చెందిన అరుదైన బ్లాక్ అండ్ వైట్ ఫొటోను న్యూ హారిజాన్‌‌స తీసింది. ఆ సయమంలో ఈ స్పేస్‌క్రాఫ్ట్ భూమికి 612 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. తన అత్యాధునిక లాంగ్ రేంజ్ రీకానిసెన్‌‌స ఇమేజర్ కెమెరాను ఆన్ చేసి ఈ అద్భుత చిత్రాలను తీసింది. ఈ క్రమంలో గతంలో నాసాకే చెందిన వోయేజర్స్ 1 రికార్డును కూడా బీట్ చేసింది. వోయెజర్స్ స్పేస్‌క్రాఫ్ట్ అత్యధికంగా 606 కోట్ల కిలోమీటర్ల దూరం వెళ్లి ఫొటోలు తీసింది. ఇప్పుడు న్యూ హారిజాన్‌‌స ఆ దూరాన్ని దాటి ఇంకా ముందుకు సాగుతూనే ఉన్నది. ప్రస్తుతం ఈ స్పేస్‌క్రాఫ్ట్ రోజుకు 11 లక్షల కిలోమీటర్ల వేగంతో విశ్వంలో దూసుకెళ్తోంది. 

కొత్త రకం అణ్వస్త్రాలను అభివృద్ధి చేస్తున్న పాక్
పాకిస్తాన్ కొత్త రకం అణ్వాయుధాలను తయారుచేస్తోందని అమెరికా ఇంటెలిజెన్‌‌స చీఫ్ ఫిబ్రవరి 13న హెచ్చరించారు. వాటిలో స్వల్ప శ్రేణి ఆయుధాలు కూడా ఉండటంతో ఆ ప్రాంతంలో ప్రమాద తీవ్రత పెరుగుతోందని డెరైక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్‌‌స డ్యాన్ కోట్స్ కాంగ్రెస్‌కు చెప్పారు. సముద్రం నుంచి, ఆకాశం నుంచి ప్రయోగించగలిగే క్షిపణులు, దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణులు కూడా పాక్ తయారుచేస్తున్న వాటిలో ఉన్నాయన్నారు. 


దేశంలో పెరిగిన అటవీ విస్తీర్ణం
భారత అటవీ నివేదిక- 2017ను కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి హర్షవర్థన్ ఫిబ్రవరి 12న విడుదల చేశారు. ఈ నివేదిక ప్రకారం 2015-17 మధ్యకాలంలో భారత అటవీ విస్తీర్ణం 0.21 శాతం మేర పెరిగింది. దేశం మొత్తం అటవీ విస్తీర్ణం 7,08,273 చ.కి.మీ.గా ఉంది. ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో 21.53 శాతం వాటాను కలిగి ఉంది.

ల్యాబ్‌లో మానవ అండాల అభివృద్ధి
బ్రిటన్‌లోని ఎడిన్‌బర్గ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు మానవ అండాలను ప్రయోగశాలలో విజయవంతంగా పెంచారు. ఇవి మానవ అండాల అభివృద్ధి తీరుతెన్నులను తెలుసుకునేందుకు ఉపయోగపడతాయని లండన్‌లో ఫిబ్రవరి 9న వెల్లడించారు. కాగా, ఎలుకల అండాలను దాదాపు 20 ఏళ్ల కిందటే శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో అభివృద్ధి చేశారు. పరిశోధనల్లో భాగంగా 25-40 ఏళ్ల వయసు కలిగిన 10 మంది మహిళల నుంచి అండాశయ కణజాలాన్ని సేకరించారు.

కనువిందు చేసిన సూపర్ బ్లూ బ్లడ్ మూన్ ప్రపంచవ్యాప్తంగా సూపర్ బ్లూ బ్లడ్‌మూన్ జనవరి 31న కనువిందు చేసింది. అమెరికాతోపాటు ఆస్ట్రేలియా, పలు ఆసియా దేశాలు, రష్యాలోని కొన్ని భాగాల్లో కోట్లాది మంది ప్రజలు ఈ ఖగోళ అద్భుతాన్ని ఉత్సాహంగా వీక్షించారు. కాలిఫోర్నియాతోపాటు పశ్చిమ కెనడాలోని ప్రజలు చంద్ర గ్రహణాన్ని పూర్తిగా చూశారని నాసా వెల్లడించింది. దక్షిణ అమెరికా ఖండం, పశ్చిమ యూరప్‌తోపాటు ఆఫ్రికాలోని చాలా దేశాల్లో సూపర్ బ్లూ బ్లడ్ మూన్ కనిపించలేదు. భారత్‌లోనూ అనేక మంది ప్రజలు చంద్రగ్రహణాన్ని వీక్షించారు. 
పౌర్ణమినాడు చంద్రుడు భూమికి అత్యంత దగ్గరగా వచ్చినప్పుడు సూపర్‌మూన్ అంటారు. అలాగే ఒకే నెలలో రెండుసార్లు పౌర్ణమి వస్తే దానిని బ్లూ మూన్ అంటారు. చంద్రగ్రహణం నాడు ముదురుఎరుపు రంగులో కనిపించే చంద్రుడిని బ్లడ్‌మూన్ అంటారు. జనవరి 31న ఈ మూడు ఏకకాలంలో ఆవిష్కృతమయ్యాయి.


స్కార్పియన్ శ్రేణి జలాంతర్గామి కరంజ్ జలప్రవేశం
భారత నావికాదళంలో స్కార్పిన్ శ్రేణికి చెందిన మూడో అత్యాధునిక జలాంతర్గామి ఐఎన్‌ఎస్ కరంజ్ జలప్రవేశం చేసింది. నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్‌లాంబా భార్య రీనా లాంబా జనవరి 31న ముంబైలో ఐఎన్‌ఎస్ కరంజ్‌ను ప్రారంభించారు. ఫ్రెంచ్ నౌకా తయారీ సంస్థ డీసీఎన్‌ఎస్ భాగస్వామ్యంతో స్కార్పిన్ జలాంతర్గాముల్ని ముంబైలోని మజ్‌గావ్ డాక్ లిమిటెడ్ నిర్మిస్తున్నారు. తాజాగా ఐఎన్‌ఎస్ కరంజ్‌తో నేవీలో మూడు స్కార్పిన్ శ్రేణి జలాంతర్గాములను ప్రవేశపెట్టినట్లయింది. ఛత్రపతి శివాజీ నావికాదళం ఆధీనంలోని కరంజా ద్వీపం పేరు మీదుగా ఈ జలాంతర్గామికి ఐఎన్‌ఎస్ కరంజ్‌గా నామకరణం చేశారు. 


చెన్నైలో కృత్రిమ చెవి తయారీ 
దేశంలోనే ప్రప్రథమంగా చెన్నై సైన్స్ ల్యాబ్‌లో వైద్యులు కృత్రిమ చెవిని రూపొందించారు. ఈ మేరకు నిర్వహించిన ప్రయోగం విజయవంతమైనట్లు సిమ్స్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో కృత్రిమ చెవి నిర్మాణం జరిగినట్లు వెల్లడించారు. ఎస్‌ఆర్‌ఎం వర్సిటీ, సిమ్స్ ఆసుపత్రి సంయుక్తంగా దీనిని రూపొందించింది. చెవులు కోల్పోయిన వారి కోసం వారి దేహంలోని ఒక ప్రదేశంలో కణాలను తీసుకొని ల్యాబ్‌లో కృత్రిమ చెవులను తయారు చేస్తున్నారు. 


అగ్ని-1 పరీక్ష విజయవంతం 
అణ్వాయుధ సామర్థ్యం కలిగిన అగ్ని-1 బాలిస్టిక్ క్షిపణిని భారత సైన్యం ఫిబ్రవరి 6న విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని బాలసోర్‌లోగల అబ్దుల్ కలామ్ దీవి నుంచి దీన్ని ప్రయోగించారు. భారతీయ ఆర్మీకి చెందిన స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ పరీక్షించిన క్షిపణ 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను చేధించగలదు. అగ్ని -1లో ఇది 18వ వర్షెన్. నిర్ణీత సమయంలోనే క్షిపణి టార్గెట్‌ను చేధించినట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. ఈ క్షిపణి 2004లోనే సైన్యానికి అందుబాటులోకి వచ్చింది. సైనిక దళాలు తమ రెగ్యులర్ శిక్షణ విన్యాసాల సందర్భంగా దీనిని పరీక్షించారు. లక్ష్యాన్ని అత్యంత కచ్చితంగా చేరుకునే ప్రత్యేక నావిగేషన్ వ్యవస్థ అగ్ని-1 క్షిపణిలో ఉందని అధికారులు తెలిపారు. రేంజ్, అక్యూరెసీలో అగ్ని -1 అత్యద్భుత ప్రదర్శన జరిపినట్లు అధికారులు చెప్పారు. 15 మీటర్లు పొడవు ఉండే అగ్ని-1 సుమారు 12 టన్నుల బరువు ఉంటుంది. ఇది సుమారు వెయి్య కిలోల పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలదు. ఇదే బేస్ నుంచి గతంలో అగ్ని-1 క్షిపణిని 2016 నవంబర్ 22వ తేదీన ప్రయోగించారు. 


అతి చిన్న రాకెట్ ప్రయోగం విజయవంతం
జపాన్ అంతరిక్ష సంస్థ..జక్సా ఫిబ్రవరి 4న ప్రపంచంలోనే అతి చిన్న రాకె ట్(ఎస్‌ఎస్-520)ను విజయవంతంగా ప్రయోగించింది. దీని ద్వారా ట్రైకామ్-1ఆర్(సూక్ష్మ ఉపగ్రహం)ను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఎస్‌ఎస్-520 పొడవు 10 మీటర్లు కాగా, వ్యాసం 53 సెంటీమీటర్లు. ఈ ప్రయోగం కగోషిమా ఫ్రిపెక్చర్‌లోని ఉంచినోరా అంతరిక్ష కేంద్రం నుంచి జరిగింది. 

విహరించిన తేలికపాటి హెలికాప్టర్
భారత తేలికపాటి పోరాట హెలికాప్టర్(ఎల్‌సీహెచ్-టీడీ2) జనవరి 31న బెంగళూరులో 20 నిమిషాలపాటు విహరించింది. దీనికి తొలిసారిగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్‌ఏఎల్) రూపొందించిన ఆటోమేటిక్ ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్(ఏఎఫ్‌సీఎస్)ను అమర్చి ప్రయోగించారు.