Sunday, 11 February 2018

డిసెంబర్ 2017 సైన్స్ & టెక్నాలజీ

నీటిని శోషించుకున్న మార్స్ ఉపరితలం 
అంగారక గ్రహంపై ఒకప్పుడు నదిలా ప్రవహించిన నీటిని అంగారక గ్రహ ఉపరితలం స్పాంజ్ మాదిరిగా శోషించుకుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. భూ ఉపరితలంపై ఉన్న రాళ్ల కంటే మార్స్ ఉపరితలంపై రాళ్లు 25 శాతం అధికంగా నీటిని శోషించుకుంటాయని గుర్తించారు. ఎప్పటినుంచో ఈ విధంగా శాస్త్రవేత్తలు ఆలోచిస్తున్నా.. తొలిసారి తాము మాత్రం ప్రయోగాత్మకంగా దీన్ని నిరూపించామని వర్సిటీకి చెందిన పరిశోధకులు జాన్ వేడ్ వెల్లడించారు. ఇప్పటివరకు అయస్కాంత క్షేత్రం ఒక్కసారిగా పతనమవడంతో నీరు అంతరిక్షంలోకి మళ్లిందని పరిశోధకులు భావించేవారు. 

ఫేస్‌బుక్ కొత్త ఖాతాకు ఆధార్నకిలీ ఖాతాలను అరికట్టడంలో భాగంగా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ కీలక నిర్ణయం తీసుకుంది. మొబైల్ ద్వారా కొత్తగా ఫేస్‌బుక్‌లో ఖాతాలు తెరిచేవారిని ఆధార్ కార్డులో ఉన్న పేరును ఇవ్వాల్సిందిగా ఆ సంస్థ కోరుతోంది. ‘ఆధార్ కార్డులో ఉన్న పేరును ఇవ్వండి’ అని ఫేస్‌బుక్‌లో ఓ ప్రాంప్ట్ వస్తోంది. దీంతోపాటు ‘మీ పేరేంటి? ఆధార్ కార్డులోని అసలు పేరు ఇవ్వడం ద్వారా స్నేహితులు మిమ్మల్ని సులభంగా గుర్తించగలరు. నకిలీల బెడద తగ్గుతుంది’ అన్న సందేశం తెరపై ప్రత్యక్షమవుతోంది. రెడిట్, ట్వీటర్ వాడుతున్న కొందరు యూజర్లు దీన్ని గుర్తించారు. అయితే.. వినియోగదారులు ఆధార్‌లోని తమ పేర్లను ఇవ్వాలన్నది ఐచ్ఛికమే. ప్రస్తుతం దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్లు ఫేస్‌బుక్ ప్రకటించింది. 

తొలిసారి ఎగిరిన ఉభయచర విమానం ప్రపంచంలోనే అతిపెద్ద ఉభయచర విమానం తొలిసారి డిసెంబర్ 24న గాల్లోకి ఎగిరింది. దీన్ని చైనా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసింది. కున్లాంగ్(ఎజీ600)గా పిలిచే ఈ విమానం దక్షిణ చైనాలోని గువాంగ్‌డంగ్ ప్రావిన్స్‌లోని జుహాయ్ విమానాశ్రయం నుంచి గాల్లోకి దూసుకెళ్లినట్లు చైనా వార్తా సంస్థ షిన్ హువా తెలిపింది.

ఐఎన్‌ఎస్ కల్వరి జలప్రవేశంస్కార్పిన్ శ్రేణికి చెందిన అత్యాధునిక జలాంతర్గామి ‘ఐఎన్‌ఎస్ కల్వరి’ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్ 14న ముంబైలో భారత నౌకాదళంలో ప్రవేశపెట్టారు. ఈ జలాంతర్గామిని ఫ్రెంచ్ కంపెనీ డీసీఎన్‌ఎస్ డిజైన్ చేయగా రక్షణ శాఖకు చెందిన మజగాన్ డాక్ లిమిటెడ్ (ఎండీఎల్-ముంబై) నిర్మించింది. హిందూ మహాసముద్రంలోని భయంకరమైన ‘టైగర్’ షార్క్ (మలయాళంలో కల్వరి అంటారు) పేరును ఈ జలాంతర్గామికి పెట్టారు. స్కార్పిన్ సిరీస్‌లో మొత్తం ఆరు సబ్‌మెరైన్లు నిర్మిస్తుండగా అందులో కల్వరి మొదటిది.
కల్వరి ప్రత్యేకతలుజలాంతర్గామి జాడ చిక్కకుండా ధ్వనిని అదుపు చేసే అత్యాధునిక సాంకేతికత. 
యాంటీ షిప్ క్షిపణులతో నీళ్లలోను, సముద్ర ఉపరితలంపైనా దాడిచేయవచ్చు. 
రేడియేషన్ స్థాయిలు అతి తక్కువగా ఉంటాయి. 
పొడవు: 67.5 మీ (221 అడుగులు)
వేగం: నీటిలో ఉన్నప్పుడు గంటకు 37 కి.మీ.
సముద్ర ఉపరితలంపై గంటకు 22 కి.మీ.
పరిధి: ఉపరితలంపై 12,000 కి.మీ. నీటిలో ఉన్నప్పుడు 1,020 కి.మీ.
18 టార్పెడోలను మోసుకెళ్లగలదు. 350 మీటర్ల లోతుకు వెళ్లగలదు


కెప్లర్ 90 సౌరవ్యవస్థలో 8వ గ్రహం గుర్తింపునాసా కృత్రిమ మేధ సాయంతో కెప్లర్ 90 సౌరవ్యవస్థలో 8వ గ్రహం కెప్లర్ 90ఐ ను డిసెంబర్ 14న గుర్తించింది. కెప్లర్ 90 గ్రహ వ్యవస్థ భూమికి 2,545 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. 90ఐ గ్రహం మాతృ నక్షత్రం చుట్టూ ఒక సారి తిరిగేందుకు 14.4 రోజుల సమయం తీసుకుంటుంది. దీని ద్రవ్యరాశి భూమి కంటే 2.5 రెట్లు ఎక్కువ. గ్రహం మొత్తమ్మీద ఉండే ఉష్ణోగ్రత 436 డిగ్రీల సెల్సియస్. భూమిని పోలిన గ్రహాలను గుర్తించేందుకు నాసా 2009లో కెప్లర్ టెలిస్కోప్‌ను ప్రయోగించింది. నాలుగేళ్లలో 35 వేల గ్రహాల ఉనికిపై కెప్లర్ సంకేతాలిచ్చింది.
కెప్లర్ టెలిస్కోప్ సేకరించిన సమాచారంతో గ్రహాల ఉనికిని గుర్తించడంపై కృత్రిమ మేధకు శిక్షణ ఇచ్చారు. బలహీనమైన సంకేతాలున్న 670 గ్రహ వ్యవస్థల సమాచారాన్ని కంప్యూటర్‌కు ఫీడ్ చేశారు. దాన్ని పరిశీలించిన కంప్యూటర్.. కెప్లర్ 90, కెప్లర్ 80 గ్రహ వ్యవస్థల్లో ఒక్కో కొత్త గ్రహం ఉన్నట్లు గుర్తించింది. కెప్లర్ 90లో 7 గ్రహాలను ఇప్పటికే గుర్తించారు. సౌరకుటుంబానికి ఆవల ఉన్న గ్రహ వ్యవస్థలో 7 గ్రహాలతో ట్రాపిస్ట్-1 మొదటి స్థానంలో ఉంది.
గ్రావిటీ లెన్సింగ్ అంటే?ప్రకాశవంతమైన నక్షత్రం ముందు నుంచి గ్రహం వెళ్తున్నప్పుడు అక్కడి నుంచి వచ్చే వెలుగు కొంచెం తగ్గుతుంది. ఈ తగ్గుదలను బట్టి అక్కడ గ్రహం ఉందా లేదా అనేది తెలుసుకుంటారు. దీనినే గ్రావిటీ లెన్సింగ్ అంటారు. కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉండే గ్రహాలను గుర్తించేందుకు ఈ పద్ధతిని శాస్త్రవేత్తలు ఉపయోగిస్తారు.


ఎంఐ-8 హెలికాప్టర్లకు వీడ్కోలు 45 ఏళ్ల సుదీర్ఘ కాలం పాటు సాయుధ బలగాలకు సేవలందించిన ఎంఐ-8 హెలికాప్టర్లు తెరమరుగయ్యాయి. ‘ప్రతాప్’గా పిలిచే సోవియెట్ కాలానికి చెందిన ఈ హెలికాప్టర్లకు వాయుసేన డిసెంబర్ 17న అధికారికంగా వీడ్కోలు పలికింది. 1972లో భారత వాయుసేనలో చేరిన ఇవి ఆపరేషన్ మేఘదూత్, ఆపరేషన్ పవన్ లాంటి కీలక సమయాల్లో సైనికులు, వాహనాల తరలింపులో విశేష సేవలందించాయి. బెంగళూరులోని ఎలహంక వైమానిక స్థావరంలో జరిగిన వీడ్కోలు కార్యక్రమంలో చివరిసారిగా ఇవి తమ విన్యాసాలతో ఆకట్టుకున్నాయి. ఎయిర్ చీఫ్ మార్షల్(రిటైర్డ్) ఫాలి హోమి మేజర్‌తో పాటు కొందరు మాజీ వాయు సేనాధికారులు చివరిసారి ఈ హెలికాప్టర్లను నడిపారు. 


సుఖోయ్‌కు బ్రహ్మోస్ అమర్చే ప్రక్రియ ప్రారంభంరష్యన్ తయారీ సుఖోయ్-30 యుద్ధవిమానాల్లో సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్‌ను అమర్చే ప్రక్రియ ప్రారంభమైనట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. దాదాపు 40 సుఖోయ్ యుద్ధవిమానాలకు ఈ క్షిపణుల్ని అమర్చనున్నట్లు వెల్లడించాయి. ఈ ప్రక్రియ 2020 నాటికల్లా పూర్తవుతుంది. సుఖోయ్-30 యుద్ధవిమానం ద్వారా తొలిసారి బ్రహ్మోస్‌ను నవంబర్ 22న ప్రయోగించారు. సుఖోయ్‌ల్లో బ్రహ్మోస్ క్షిపణుల్ని అమర్చే ప్రక్రియను ప్రభుత్వరంగ సంస్థ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ చేపట్టింది. తాజాగా సుఖోయ్ యుద్ధవిమానాల్లో ఈ మార్పులు చేపడితే.. సముద్రంపై, భూభాగాలపై ఉన్న సుదూర లక్ష్యాల్ని ఛేదించగల సామర్థ్యం వాయుసేనకు సమకూరుతుంది. భారత్-రష్యా రూపొందించిన బ్రహ్మోస్ క్షిపణి ధ్వనికంటే 3 రెట్లు వేగంగా దూసుకుపోతుంది. 2.5 టన్నుల బరువున్న ఈ క్షిపణి 290 కి.మీ పరిధిలోని లక్ష్యాలను ఛేదిస్తుంది.


రామసేతు మానవ నిర్మాణమే: సైన్స్ చానల్రామసేతు (Adam's Bridge) అనేది వేల సంవత్సరాల కింద మానవుడు నిర్మించినదేనని అమెరికా డిస్కవరీ కమ్యూనికేషన్‌‌స సంస్థకు చెందిన సైన్స్ చానల్ ఓ కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. ఇందులో పలువురు భూగర్భ, పురాతత్వ శాస్త్రవేత్తలు, ఉపగ్రహ చిత్రాలను ఉటంకిస్తూ ఆ నిర్మాణం సహజసిద్ధమైనది కాదని తేల్చింది. రామసేతువు వేల సంవత్సరాలుగా భూ పలకల్లో చోటు చేసుకున్న మార్పుల వల్ల ఏర్పడిన సహజ సిద్ధ నిర్మాణమనే వాదన మరోవైపు ఉంది. ఇది తమిళనాడులోని పంబన్, శ్రీలంకలోని మన్నార్ దీవుల మధ్య దాదాపు 50 కిలోమీటర్ల దూరంపాటు సముద్రంలో ఉంది. ఆ ప్రాంతంలోని ఇసుక సహజసిద్ధంగా ఏర్పడినది కాగా, దానిపై ఉన్న రాళ్లు మాత్రం కృత్రిమంగా తీసుకొచ్చి పేర్చినట్లు ఉన్నాయని అలన్ లెస్టర్ అనే భూవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు తెలిపారు. రామ సేతువు ప్రాంతంలో ఉన్న రాళ్లు 7 వేల ఏళ్ల పురాతనమైనవి కాగా, రామసేతువును దాదాపు 5 వేల ఏళ్ల క్రితం నిర్మించి ఉంటారనీ ఆ చానల్ పేర్కొంది.
రామసేతువు నిర్మాణాన్ని పరిశోధించే బాధ్యతను గతంలో భారత చారిత్రక పరిశోధన మండలి (ఐసీహెచ్‌ఆర్)కు అప్పగించారు. ప్రస్తుతం ఈ పరిశోధన కొనసాగుతోంది. అయితే చరిత్రలోని క్రీ.పూ 4,000- క్రీ.పూ 1,000ల మధ్య కాలాన్ని ‘డార్క్ పీరియడ్’గా పరిగణించి మరింత లోతుగా విశ్లేషించేందుకు ప్రయత్నిస్తున్నామని ఐసీహెచ్‌ఆర్ చైర్మన్ వై.సుదర్శనరావు వివరించారు.


గూగుల్ సెర్చ్‌లో బాహుబలి-2 టాప్2017లో ఇంటర్నెట్‌లో అత్యధికులు శోధించిన అంశాల్లో బాహుబలి-2 చిత్రం తొలిస్థానంలో నిలిచింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రెండోస్థానం, ‘లైవ్ క్రికెట్ స్కోర్’ అనే పదం మూడోస్థానంలో నిలిచాయి. ఈ మేరకు గూగుల్ డిసెంబర్ 13న ఒక జాబితా విడుదల చేసింది. ఇందులో బాలీవుడ్ సినిమా దంగల్, హాఫ్ గర్ల్‌ఫ్రెండ్, బద్రీనాథ్ కీ దుల్హానియా చిత్రాలు, చాంపియన్‌‌స ట్రోఫీ తదితర అంశాలు టాప్-10లో ఉన్నాయి. ఈ ఏడాదికి ‘సెక్సియెస్ట్ ఏషియన్ మ్యాన్’గా బాలీవుడ్ నటుడు షాహీద్ కపూర్ ఎంపికయ్యారు.


బెంగళూరులో అంతరిక్ష మ్యూజియందేశంలోనే తొలిసారిగా అంతరిక్ష విజ్ఞానాన్ని అందించే నూతన మ్యూజియంను నవంబర్ 29న బెంగళూరులో ప్రారంభించారు. ఉపగ్రహ తయారీ మొదలు అది అతరిక్షంలోకి వెళ్లే వరకు ఉండే విశేషాలను ఈ మ్యూజియంలో పొందుపరిచారు. దీనిని విశ్వేశ్వరాయ ఇండస్ట్రియల్ అండ్ టెక్నలాజికల్ మ్యూజియం (వీఐటీఎం)తో కలసి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఏర్పాటు చేసింది. ఇందులో రాకెట్ బయలుదేరినప్పటి నుంచి ఉపగ్రహం కక్ష్యలోకి వెళ్లే వరకు జరిగే ప్రతి ఘటననూ సిములేటర్ ద్వారా ప్రత్యక్ష అనుభవంలో చూడొచ్చు. 

No comments:

Post a Comment