Sunday, 11 February 2018

జనవరి 2018 సైన్స్ & టెక్నాలజీ

భూ అధ్యయనానికి నాసా గోల్డ్ మిషన్’ 
భూ వాతావరణం, అంతరిక్షం కలిసే చోట వాతావరణ పొరల్లోని మార్పుల్ని క్షుణ్నంగా అధ్యయనం చేసేందుకు అంతరిక్ష సంస్థ నాసా తొలిసారి ప్రత్యేక మిషన్‌ను అంతరిక్షంలోకి పంపింది. ‘ద గ్లోబల్ స్కేల్ అబ్జర్వేషన్‌‌స ఆఫ్ ద లింబ్ అండ్ డిస్క్(గోల్డ్)’గా పిలిచే ఈ మిషన్‌ను ఫ్రెంచ్ గయనాలోని కౌరు నుంచి ‘ఎస్‌ఈఎస్-13’ సమాచార ఉపగ్రహానికి అనుసంధానించి జనవరి 26న ప్రయోగించింది. భూ వాతావరణంలోని చిట్టచివరి పొరల్లో ఉష్ణోగ్రతలు, విద్యుదయస్కాంత క్షేత్రాల్లో మార్పుల్ని ఈ మిషన్ అంచనావేస్తుంది. 
భూవాతావరణం, అంతరిక్షం కలిసే ఈ ప్రాంతంలో విద్యుదయస్కాంత అణువులతో కూడిన అయనోస్పియర్, తటస్థ వాతావరణంతో కూడిన థర్మోస్పియర్‌లు పరస్పరం ప్రభావితం చేసుకుంటూ ఉంటాయి. జీపీఎస్ వ్యవస్థ, రేడియో సిగ్నల్స్నిప్రభావితం చేసే ఈ ప్రాంతాన్ని పరిశీలించేందుకు ‘గోల్డ్’ వ్యవస్థలో తగిన విధమైన ఏర్పాట్లు చేశారు. 


చైనాలో కృత్రిమ చంద్రుడిపై విద్యార్థుల పరిశోధన
చైనాకు చెందిన కొందరు విద్యార్థులు భూమిపై చంద్రుడిని పోలిన వాతావరణాన్ని కృత్రిమంగా ల్యాబ్‌లో సృష్టించి సుమారు 200 రోజుల పాటు అందులో గడిపారు. చైనాలోని బీహాంగ్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు యూగ్యాంగ్-1 పేరుతో సుమారు 160 చదరపు మీటర్ల విస్తీర్ణంలో దీన్ని నిర్మించారు. 
తొలుత అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరు చొప్పున ల్యాబ్‌లోకి ప్రవేశించి 60 రోజుల పాటు చంద్రుడి వాతావరణంలో జీవించి బయటకు వచ్చారు. అనంతరం వీరి స్థానంలో మరో నలుగురు వలంటీర్లు ల్యాబ్‌లోకి ప్రవేశించి 200 రోజుల పాటు అందులోనే ఉన్నారు. వీరు ల్యాబ్‌లో ఉన్నప్పుడు బయట నుంచి ఎటువంటి సహాయం తీసుకోలేదని.. ఈ ప్రయోగంలో వలంటీర్లు అనేక సవాళ్లు ఎదుర్కొన్నారని ప్రాజెక్టు ముఖ్య రూపకర్త లి హాంగ్ వెల్లడించారు. ల్యాబ్‌లో ఉన్న సమయంలో వలంటీర్లు స్వయంగా కూరగాయలు, పంటలను ఆహార వ్యర్థపదార్థాల సహాయంతో పండించుకున్నారని తెలిపింది. చంద్రుడిపైకి మనుషులను పంపి శాశ్వత నివాసం ఏర్పాటు చేయాలని భావిస్తున్న చైనాకు ఆ దేశ విద్యార్థులు చేసిన ప్రయోగం ఓ దిక్సూచిగా నిలవనుంది. 
 

సరస్ విమాన ప్రయోగం విజయవంతం
బెంగళూరులోని నేషనల్ ఏరోనాటిక్స్ ల్యాబొరేటరీ (ఎన్‌ఏఎల్) అభివృద్ధి చేసిన 14 సీట్ల సరస్ విమానాన్ని జనవరి 24న విజయవంతంగా పరీక్షించారు.

ఫాస్టెస్ట్ ప్లేన్‌ను రూపొందిస్తున్న అమెరికా ప్రపంచం అత్యంత వేగంతో ప్రయాణించే విమానాన్ని అమెరికా రూపొందిస్తోంది. ఆ దేశానికి చెందిన ఫైటర్ జెట్ల తయారీ సంస్థ లాక్ హీడ్ మార్టిన్ స్పై ప్లేన్ ‘ఎస్‌ఆర్-72 బ్లాక్‌బర్డ్’ను అభివృద్ధి చేస్తోంది. కోల్డ్‌వార్ సమయంలో ఎస్‌ఆర్-71 బ్లాక్‌బర్డ్ విమానం ద్వారా రష్యాపై అమెరికా గూఢచర్యం నిర్వహించింది. దాదాపు 30 ఏళ్ల క్రితం ఎస్‌ఆర్-71 విధుల నుంచి తప్పుకుంది. ఆ తర్వాత అమెరికా ఎలాంటి స్పై జెట్‌ను రూపొందించలేదు. తాజాగా రూపొందుతున్న ఎస్‌ఆర్-72ను ‘సన్ ఆఫ్ బ్లాక్‌బర్డ్’ గా లాక్ హీడ్ మార్టిన్‌కు చెందిన అధికారులు చెబుతున్నారు. 2030లో ఈ ప్లేన్ రంగంలోకి దిగుతుందని అంచనా వేస్తున్నారు. హైపర్ సోనిక్ టెక్నాలజీని వినియోగించడం వల్ల ధ్వనివేగం కంటే ఆరు రెట్లు ఎక్కువ(మాక్-6)వేగంతో ఎస్‌ఆర్-72 ప్రయాణిస్తుంది. కోల్డ్‌వార్ సమయంలో సేవలందిచిన ఎస్‌ఆర్-71 మాక్-3.5 వేగం (సుమారు గంటకు 2వేల కిలోమీటర్లు)తో ప్రయాణించేది. 

అగ్ని-5 పరీక్ష విజయవంతంఅణ్వాయుధాలను మోసుకెళ్లే సామర్థ్యమున్న బాలిస్టిక్ క్షిపణి అగ్ని-5 పరీక్షని భారత్ విజయవంతంగా నిర్వహించింది. ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం దీవి నుంచి కానిస్టర్ ద్వారా జనవరి 18న ఈ క్షిపణిని పరీక్షించారు. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే ఈ క్షిపణి 5 వేల కిలోమీటర్ల దూరానికి పైగా ఉన్న లక్ష్యాన్ని చేధించగలదు. ఎన్నో అత్యాధునిక సాంకేతికతలున్న ఈ క్షిపణి ప్రయోగం విజయవంతం కావడంతో క్షిపణి తయారీలో దేశీయ సాంకేతికతకు నూతనోత్సాహం వచ్చింది. అన్ని రాడార్లు, ట్రాకింగ్ వ్యవస్థలు క్షిపణి పనితీరును పరిశీలించినట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. పరీక్ష పూర్తిగా విజయవంతమైందని, 19 నిమిషాల పాటు ప్రయాణించిన క్షిపణి 4,900 కిలోమీటర్లు దూసుకెళ్లిందని వెల్లడించాయి.
అగ్ని శ్రేణిలో ‘అగ్ని-5’మరింత ఆధునికమైంది. కొత్త సాంకేతికతలతో అభివృద్ధి చేశారు. విస్తారమైన నావిగేషన్ వ్యవస్థ (ఆర్‌ఐఎన్‌ఎస్), అత్యాధునికమైన మైక్రో నావిగేషన్ వ్యవస్థ (ఎంఐఎన్‌ఎస్)లు ఉండటం వల్ల ఈ క్షిపణి చాలా కచ్చితత్వంతో లక్ష్యాన్ని చేధించగలదు. 
అగ్ని శ్రేణిలో క్షిపణులు.. 
క్షిపణి
లక్ష్యాన్ని చేధించగలిగే సామర్థ్యం
అగ్ని-1
700 కి.మీ.
అగ్ని-2
2000 కి.మీ.
అగ్ని-3
2,500 నుంచి 3,500 కి.మీ.
అగ్ని-5
5,000 కి.మీ.

రష్యా నుంచి భారత్‌కు ‘ట్రయంఫ్’ క్షిపణి వ్యవస్థ రష్యా నుంచి ఎస్-400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు సంబంధించిన తుది చర్చలను కేంద్రం తాజాగా ప్రారంభించింది. ఇప్పటికే భారత్‌కు ఆకాశ్, బరాక్-8 తదితర క్షిపణి వ్యవస్థలుండగా.. ఎస్-400 ట్రయంఫ్ క్షిపణులను కూడా కొనుగోలు చేయాలని భారత్ భావిస్తోంది. ఇందుకు కారణం ఇది అత్యంత శక్తిమంతమైన, అధునాతన క్షిపణి కావడమే. ఈ నేపథ్యంలో ఎస్-400 ట్రయంఫ్ క్షిపణుల గురించి క్లుప్తంగా.. 
రష్యా ఉత్పత్తి చేసే, ఉపరితలం నుంచి ఆకాశంలోకి ప్రయోగించే ఎస్-400 ట్రయంఫ్ శ్రేణిలోని ఐదు క్షిపణి వ్యవస్థలను 39 వేల కోట్ల రూపాయలు (5 బిలియన్ అమెరికన్ డాలర్లు) వెచ్చించి కొనుగోలు చేయాలని భారత్ 2015లోనే నిర్ణయించింది. ఆ ఏడాది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రష్యా పర్యటనకు వెళ్లడానికి కొన్ని రోజుల ముందే ఎస్-400 ట్రయంఫ్ క్షిపణుల కొనుగోలు ప్రతిపాదనను రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని డిఫెన్‌‌స అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) ఆమోదించింది. ప్రస్తుతం తుది చర్చలను ప్రారంభించిన భారత ప్రభుత్వం.. 2018-19 ఆర్థిక సంవత్సరం చివరిలోపు ఒప్పందాన్ని అమలు చేయాలని భావిస్తోంది. ఒప్పందం ఖరారైతే చైనా తర్వాత ఈ క్షిపణులను కొనుగోలు చేయనున్న రెండో దేశంగా భారత్ నిలవనుంది. చైనా 2014లోనే ఎస్-400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థల కొనుగోలు ఒప్పందాన్ని ఖరారు చేసుకుంది.
ఎప్పటికి వస్తాయి? మొత్తం ఐదు క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు ఒప్పందం చేసుకునేందుకు భారత్ ప్రయత్నిస్తుండగా, డీల్ కుదిరిన వెంటనే తొలి క్షిపణి వ్యవస్థ భారత్‌కు చేరనుంది. అయితే దీనికి అనుబంధంగా ఉండే కొన్ని యుద్ధ నిర్వహణ పరికరాలు రావడానికి మాత్రం రెండేళ్ల సమయం పడుతుంది. మొత్తం ఐదు క్షిపణులు భారత అమ్ములపొదిలో చేరడానికి నాలుగున్నరేళ్ల వ్యవధి అవసరమని రక్షణ శాఖకు చెందిన ఓ అధికారి చెప్పారు. అంతా అనుకున్నట్లు జరిగితే భారత్-రష్యాల మధ్య కుదిరిన భారీ ఆయుధ ఒప్పందాల్లో ఇది ఒకటిగా నిలుస్తుందని ఆయన అన్నారు. 
ట్రయంఫ్-400 ప్రత్యేకతలుశత్రు దేశాల క్షిపణులు, డ్రోన్లు, గూఢచర్య విమానాలు 600 కిలోమీటర్ల దూరంలో ఎక్కడ ఉన్నా ఎస్-400 ట్రయంఫ్ వాటిని గుర్తించి నాశనం చేయగలదు. ఏకకాలంలో 36 లక్ష్యాలపై ఇది దాడులు చేయగలదు. ఎస్-300 క్షిపణుల కన్నా ఇది రెండున్నర రెట్లు ఎక్కువ వేగంతో దాడులు చేస్తుంది. అందుకే ఎస్-400 ట్రయంఫ్‌ను రష్యా వద్దనున్న అత్యంత శక్తిమంతమైన, అధునాతన క్షిపణి వ్యవస్థగా పేర్కొంటారు. భారత్‌కు ఈ క్షిపణులు అందుబాటులోకి వస్తే పాకిస్తాన్‌లోని అన్ని వైమానిక స్థావరాలు, టిబెట్‌లోని చైనా స్థావరాలపై కూడా దాడులు చేయొచ్చు. ఆయుధ సంపత్తి విషయంలో పాక్‌పై భారత్ పైచేయి సాధించడంతోపాటు, చైనాతో సరిసమానంగా నిలిచేందుకు ఎస్-400 ట్రయంఫ్ దోహదపడనుంది. పాకిస్తాన్ వద్దనున్న స్వల్ప శ్రేణి క్షిపణి నాస్‌న్రు ఇది దీటుగా ఎదుర్కొంటుంది. వీటిని వాహనాలపై ఇతర ప్రాంతాలకు తరలించేందుకూ వీలుంది. 

భారత్ వద్ద ఉన్న క్షిపణులుస్పైడర్ ఇజ్రాయెల్ సాంకేతికతతో తయారైన దీని పరిధి 15 కిలోమీటర్లు. వాయుసేన 4 క్షిపణులను సమకూర్చుకుంటోంది. పరిధిని 30 కిలో మీటర్లకు పెంచేందుకు డీఆర్‌డీవో ప్రయత్నిస్తోంది. 
ఆకాశ్ డీఆర్‌డీవో, బీడీఎల్, బీఈఎల్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన దీని పరిధి 25 కిలోమీటర్లు. వాయుసేన 15 ఆకాశ్ స్క్వాడ్రన్లు, ఆర్మీ నాలుగు ఆకాశ్ రెజిమెంట్లను సమకూర్చుకుంటోంది. 
బరాక్-8 డీఆర్‌డీవో-ఇజ్రాయెల్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన దీని పరిధి 70 కిలో మీటర్లు. వాయుసేన 9 క్షిపణులను సమకూర్చుకుంటోంది. యుద్ధనౌకలకు ఈ క్షిపణి వ్యవస్థలను నౌకాదళం అమర్చుకుంటోంది.

దిగ్విజయంగా నింగిలోకి పీఎస్‌ఎల్వీ సీ - 40భారత అంతరిక్ష రంగంలో మరో చారిత్రక విజయం నమోదైంది. ఇస్రో తన వందో ఉపగ్రహంతో పాటు మరో 30 ఉపగ్రహాలను ఒకేసారి అంతరిక్షంలోకి విజయవంతంగా పంపింది. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట వేదికగా 28 గంటల కౌంట్‌డౌన్ తర్వాత జనవరి 12న ఈ ప్రయోగం జరిగింది. నాలుగు ప్రయోగ దశల్లో మండిన పీఎస్‌ఎల్వీ సీ-40 వాహకనౌక కార్టోశాట్-2 సిరీస్‌లోని మూడో ఉపగ్రహంతో పాటు 30 మైక్రో, నానో ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యల్లోకి చేర్చింది. దీంతో అంతరిక్ష రంగంలో, వాణిజ్య ఉపగ్రహాల ప్రయోగాల్లో ఇస్రో తన సమర్ధతను మరోసారి చాటుకున్నట్లయింది. పీఎస్‌ఎల్వీ రాకెట్‌తో చేపట్టిన ప్రయోగాల్లో అత్యంత సుదీర్ఘ కాలం కొనసాగిన ప్రయోగం ఇదే. 
మైలురాయిగా 100వ ఉపగ్రహం... 
నాలుగు నెలల క్రితం నావిగేషన్ ఉపగ్రహం ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1హెచ్ ప్రయోగ సందర్భంగా ఎదురైన వైఫల్యాన్ని పక్కనపెట్టి ఇస్రో తాజా విజయాన్ని అందుకుంది. ఈసారి అంతరిక్షంలోకి పంపిన ఉపగ్రహాల్లో దేశీయంగా రూపొందించిన వందో ఉపగ్రహం ఉండటం ఒక మైలురాయిగా నిలిచిపోయింది. 
సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఉదయం 9.28 గంటలకు పీఎస్‌ఎల్వీ సీ-40 31 ఉపగ్రహాలతో నింగికెగిసింది. 17 నిమిషాల్లోనే కార్టోశాట్ ఉపగ్రహాన్ని 505 కి.మీ ఎత్తులోని సూర్యానువర్తిత ధృవకక్ష్యలో చేర్చింది. తర్వాత ఏడు నిమిషాల వ్యవధిలో భారత్‌కు చెందిన ఒక నానో ఉపగ్రహంతో పాటు విదేశాలకు చెందిన 28 పేలోడ్‌లను ఒకదాని తర్వాత మరోదాన్ని కక్ష్యల్లో విడిచిపెట్టింది. మిగిలిన ఏకైక(వందో ఉపగ్రహం) ఉపగ్రహాన్ని కక్ష్యలోకి చేర్చడానికి కొంత సమయం పట్టింది. ఇందుకోసం ప్రయోగం ప్రారంభమైన సుమారు 105 నిమిషాల తరువాత రాకెట్ నాలుగో దహన దశను రెండుసార్లు పునఃప్రారంభించారు. చివరి దశను పూర్తిచేయడానికి సుమారు 2 గంటల 21 నిమిషాలు పట్టింది. అత్యంత ఎక్కువ సమయం తీసుకున్న పీఎస్‌ఎల్వీ మిషన్ ఇదే. 
ఇస్రో చైర్మన్‌గా చివరి ప్రయోగాన్ని విజయవంతంగా ముగించిన కిరణ్ కుమార్ సహచరులతో కలసి సంతోషం పంచుకున్నారు. కార్టోశాట్-2 వెంట ప్రయాణించిన ఉపగ్రహాల్లో కెనడా, ఫిన్‌లాండ్, ఫ్రాన్‌‌స, కొరియా, యూకే, అమెరికాలకు చెందిన మూడు మైక్రో, 25 నానో ఉపగ్రహాలున్నాయి. 

భారత సూపర్ కంప్యూటర్ ప్రత్యూష్ ఆవిష్కరణభారత్ సూపర్ కంప్యూటర్ ప్రత్యూష్‌ను 2018, జనవరి 8న ఆవిష్కరించింది. ఇది గరిష్టంగా 6.8 పెటాప్లాప్‌ల వేగంతో పనిచేయగలదు. ఇక పెటాప్లాప్ అంటే.. సెకనుకు 1000 ట్రిలియన్ ఆపరేషన్‌‌స చేసే సామర్థ్యం. ప్రత్యూష్‌ను వాతావరణం, శీతోష్ణస్థితి అధ్యయనానికి వినియోగించనున్నట్లు పుణెలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటరాలజీ తెలియజేసింది. తద్వారా ఇలా వాతావరణం, శీతోష్ణస్థితి అధ్యయనానికి సూపర్ కంప్యూటర్‌లను వినియోగించడంలో జపాన్, యూకే, యూఎస్‌ఏ తర్వాత భారత్ నాలుగో స్థానంలో నిలిచినట్లయింది.

ఓక్కీ తుపాను రికార్డు ప్రయాణం ఇటీవల తమిళనాడు, కేరళ, లక్షద్వీప్‌లను కుదిపేసిన ఓక్కీ తుపాను 2,400 కిలోమీటర్ల దూరం ప్రయాణించిందని వాతావరణ శాస్త్రవేత్త రామచంద్రన్ తెలిపారు. గత నలభై ఏళ్లలో బంగాళాఖాతంలో ఇదే రికార్డని ఆయన పేర్కొన్నారు. 2017 నవంబర్ 28న ఓక్కీ అల్పపీడనంగా ప్రారంభమై 30వ తేదీన కన్యాకుమారి తీరాన్ని కుదిపేసింది. డిసెంబర్ 6న బలహీనపడింది.
 శాఖ 

అతిపెద్ద ప్రధాన సంఖ్య ఎం77232917 ప్రపచంలోనే ఇప్పటి వరకు తెలిసిన అతిపెద్ద ప్రధాన సంఖ్యను ఔత్సాహిక శాస్త్రవేత్త ఒకరు కనుగొన్నారు. 2017 డిసెంబర్ 26న అమెరికాకు చెందిన జొనాథన్ పేస్ అనే 51 ఏళ్ల ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఈ ఘనత సాధించారు. 2ను 7,72,32,917 సార్లు గుణించి, ఆ తర్వాత అందులో నుంచి ‘1’ ని తీసివేశారు. ఆ వచ్చిన సంఖ్యలో 2,32,49,425 అంకెలున్నాయి. ఇప్పటివరకు తెలిసిన ప్రధాన సంఖ్య కన్నా ఎం77232917 అని పిలుస్తున్న ఈ కొత్త ప్రధాన సంఖ్యలో దాదాపు 10 లక్షల అంకెలు ఎక్కువగా ఉన్నాయి. 350 ఏళ్ల కిందటే ఈ ప్రధాన సంఖ్యల గురించి అధ్యయనం చేసిన ఫ్రెంచ్ శాస్త్రవేత్త మారిన్ మెర్సెన్నె పేరు వీటికి పెట్టారు. ఈ కొత్త ప్రధాన సంఖ్యను ఆరు రోజుల పాటు ఆగకుండా లెక్కించారు. ఎం77232917 ఇప్పటి వరకు కనుగొన్న 50వ మెర్సెన్నె ప్రధాన సంఖ్య. గ్రేట్ ఇంటర్నెట్ మెర్సెన్నె ప్రైమ్ సెర్చ్ (జీఐఎంపీఎస్) అనే సాఫ్ట్‌వేర్ సాయంతో ప్రధాన సంఖ్యలు కనుగొనేందుకు వేల మంది వలంటీర్లు నిత్యం ప్రయతిస్తుంటారు. 


క్రూయిజ్ క్షిపణి హర్భాను పరీక్షించిన పాక్స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన క్రూయిజ్ క్షిపణి హర్బాను విజయవంతంగా పరీక్షించినట్లు పాకిస్థాన్ నౌకాదళం జనవరి 3న ప్రకటించింది. ఇది ఉపరితలం నుంచి ఉపరితల, భూభాగ లక్ష్యాలను ఛేదించగలదు.

సూపర్‌సోనిక్ క్షిపణి పరీక్ష విజయవంతంగగనతల రక్షణ కోసం దేశీయ పరిజ్ఞానంతో రూపొందిన సూపర్‌సోనిక్ క్షిపణి పరీక్ష విజయవంతమైంది. తక్కువ ఎత్తు నుంచి (30 కిలోమీటర్ల లోపు) వచ్చే ఎటువంటి ఖండాంతర క్షిపణులనైనా ఇది ధ్వంసం చేయగలదు. ఈ ఏడాది ఇప్పటివరకు ఇలాంటి మూడు క్షిపణులను భారత్ విజయవంతంగా పరీక్షించింది. వివిధ ఎత్తుల్లో ఖండాంతర క్షిపణుల నుంచి పూర్తి స్థాయి రక్షణ కోసం ఈ ఏడాది మార్చి 1న, ఫిబ్రవరి 11న రెండు పరీక్షలను విజయవంతంగా నిర్వహించారు. 
డిసెంబర్ 28న నిర్వహించిన మూడోపరీక్షలో చండీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ప్రదేశం నుంచి పృథ్వీ క్షిపణిని ప్రయోగించారు. రాడార్స్ నుంచి సిగ్నల్స్ రాగానే బంగాళాఖాతంలోని అబ్దుల్ కలాం (వీలర్ ద్వీపం) ద్వీపంలో ఉన్న సూపర్‌సోనిక్ క్షిపణి వెంటనే పృథ్వీ క్షిపణిని అడ్డుకుని ధ్వంసం చేసిందని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. భూమికి సుమారు 15 కిలోమీటర్ల ఎత్తులోనే ఏఏడీ పృథ్వీని అడ్డుకుని ధ్వంసం చేసిందని పేర్కొన్నాయి. 7.5 మీటర్ల పొడవుండే ఈ క్షిపణిలో నావిగేషన్ సిస్టంతో పాటు హైటెక్ కంప్యూటర్‌ను కూడా అనుసంధానం చేశారు. అమెరికా, రష్యా, ఇజ్రాయెల్ తర్వాత ఈ పరిజ్ఞానాన్ని కలిగి ఉన్న నాలుగో దేశం భారత్.
 

ఒక్క రోజులో 16 న్యూ ఇయర్స్అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్ - ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్)లో ఆరుగురు వ్యోమగాములు 2018 కొత్త ఏడాదిని ఒకేరోజులో 16 సార్లు జరుపుకోనున్నారు. భూమికి 402 కి.మీ. ఎత్తులో ప్రతి 90 నిమిషాలకోసారి భూమిని చుట్టేస్తూ 16 సూర్యోదయాలు, సూర్యాస్తమయాలను చూడటం ద్వారా వారు దీనిని సుసాధ్యం చేయనున్నారు. ఈ విషయాన్ని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా (నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్) డిసెంబర్ 29న వెల్లడించింది. 

కోల్‌కతాలో రెండో టీయూ-142 మ్యూజియంభారత నావికా దళంలో సుదీర్ఘ సేవలందించిన మరో యుద్ధ విమానం రెండో మ్యూజియంగా మారబోతోంది. ఒక దానిని ఇటీవలే విశాఖ సాగర తీరంలో ఏర్పాటుచేయగా.. ఇప్పుడు రెండో దానిని కోల్‌కతాలో మ్యూజియంగా తీర్చిదిద్దనున్నారు.

రష్యా నుంచి కొనుగోలు చేసిన ఎనిమిది టీయూ-142 యుద్ధ విమానాలు 1988లో ఇండియన్ నేవీలోకి వచ్చి 29 ఏళ్ల పాటు నిరంతరాయంగా విశేష సేవలందించాయి. వీటిని 2017 మార్చిలో నేవీ విధుల నుంచి తప్పించారు. తమిళనాడులోని అరక్కోణం నేవల్ ఎయిర్ బేస్ కేంద్రంగా ఇవి సముద్ర గగనతలంలో గస్తీ విధులు నిర్వహించాయి. కార్గిల్ యుద్ధంలోనూ పాల్గొన్నాయి. వాటి స్థానంలో కొత్తగా పీ8ఐ రకం అత్యాధునిక నిఘా విమా నాలను భారత్ కొనుగోలు చేసింది. నేవీ సేవల నుంచి నిష్ర్కమించిన టీయూ-142 యుద్ధ విమానాల్లో ఒకదాన్ని ఇటీవల విశాఖలో ఎయిర్‌క్రాఫ్ట్ మ్యూజియంగా తీర్చిదిద్దారు. దీనిని 2017 డిసెంబర్ 7న భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రారంభించారు. విశాఖ ఉత్సవ్ తొలిరోజైన డిసెంబర్ 28 నుంచి ఇందులో ప్రవేశానికి అనుమతించారు. దేశంలోకెల్లా తొలి ఎయిర్‌క్రాఫ్ట్ మ్యూజియం ఇదే. ఈ నేపథ్యంలో రెండో టీయూ-142 యుద్ధ విమాన మ్యూజియాన్ని పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఏర్పాటుచేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం రక్షణ శాఖను కోరింది. ఇందుకు రక్షణశాఖ సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ రెండో ఎయిర్‌క్రాఫ్ట్ మ్యూజియం ఆరు నెలల్లో పూర్తిచేయనున్నారు. విశాఖ ఎయిర్‌క్రాఫ్ట్ మ్యూజియాన్ని విజయవంతంగా పూర్తిచేసి అందరి ప్రశంసలందుకున్న.. ఆంధ్రకు చెందిన లెఫ్టినెంట్ కమాండర్ రమణ్‌కుమార్‌నే కోల్‌కతా మ్యూజియానికి కూడా ఇన్‌చార్జిగా పంపనున్నారు.


చెమట చిందించే రోబో ఆవిష్కరణపుష్ అప్స్, పుల్ అప్స్ వంటి కఠిన వ్యాయామాలతో పాటు స్వేదాన్ని చిందించే సరికొత్త హ్యూమనాయిడ్ రోబోను జపాన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ టోక్యోకు చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీనికి ‘కెంగొరో’గా శాస్త్రవేత్తలు నామకరణం చేశారు. కృత్రిమ స్వేద వ్యవస్థతో పాటు మానవ కండరాలను పోలిన అస్థిపంజరాన్ని రోబోలో అమర్చారు. క్రీడాకారుల కండరాల పనితీరును విశ్లేషించేందుకుగాను దీనిని రూపొందించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. కృత్రిమ స్వేద వ్యవస్థలో తాము కీలకమైన ముందడుగు వేశామని, దీని ద్వారా రోబోలోని అధిక వేడిని తగ్గించవచ్చని వెల్లడించారు. 2001 నుంచి ఈ బృందం రోబోలపై పరిశోధనలు జరుపుతోందని సైన్‌‌స రోబోటిక్స్ అనే జర్నల్ ప్రచురించింది. 




డిసెంబర్ 2017 సైన్స్ & టెక్నాలజీ

నీటిని శోషించుకున్న మార్స్ ఉపరితలం 
అంగారక గ్రహంపై ఒకప్పుడు నదిలా ప్రవహించిన నీటిని అంగారక గ్రహ ఉపరితలం స్పాంజ్ మాదిరిగా శోషించుకుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. భూ ఉపరితలంపై ఉన్న రాళ్ల కంటే మార్స్ ఉపరితలంపై రాళ్లు 25 శాతం అధికంగా నీటిని శోషించుకుంటాయని గుర్తించారు. ఎప్పటినుంచో ఈ విధంగా శాస్త్రవేత్తలు ఆలోచిస్తున్నా.. తొలిసారి తాము మాత్రం ప్రయోగాత్మకంగా దీన్ని నిరూపించామని వర్సిటీకి చెందిన పరిశోధకులు జాన్ వేడ్ వెల్లడించారు. ఇప్పటివరకు అయస్కాంత క్షేత్రం ఒక్కసారిగా పతనమవడంతో నీరు అంతరిక్షంలోకి మళ్లిందని పరిశోధకులు భావించేవారు. 

ఫేస్‌బుక్ కొత్త ఖాతాకు ఆధార్నకిలీ ఖాతాలను అరికట్టడంలో భాగంగా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ కీలక నిర్ణయం తీసుకుంది. మొబైల్ ద్వారా కొత్తగా ఫేస్‌బుక్‌లో ఖాతాలు తెరిచేవారిని ఆధార్ కార్డులో ఉన్న పేరును ఇవ్వాల్సిందిగా ఆ సంస్థ కోరుతోంది. ‘ఆధార్ కార్డులో ఉన్న పేరును ఇవ్వండి’ అని ఫేస్‌బుక్‌లో ఓ ప్రాంప్ట్ వస్తోంది. దీంతోపాటు ‘మీ పేరేంటి? ఆధార్ కార్డులోని అసలు పేరు ఇవ్వడం ద్వారా స్నేహితులు మిమ్మల్ని సులభంగా గుర్తించగలరు. నకిలీల బెడద తగ్గుతుంది’ అన్న సందేశం తెరపై ప్రత్యక్షమవుతోంది. రెడిట్, ట్వీటర్ వాడుతున్న కొందరు యూజర్లు దీన్ని గుర్తించారు. అయితే.. వినియోగదారులు ఆధార్‌లోని తమ పేర్లను ఇవ్వాలన్నది ఐచ్ఛికమే. ప్రస్తుతం దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్లు ఫేస్‌బుక్ ప్రకటించింది. 

తొలిసారి ఎగిరిన ఉభయచర విమానం ప్రపంచంలోనే అతిపెద్ద ఉభయచర విమానం తొలిసారి డిసెంబర్ 24న గాల్లోకి ఎగిరింది. దీన్ని చైనా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసింది. కున్లాంగ్(ఎజీ600)గా పిలిచే ఈ విమానం దక్షిణ చైనాలోని గువాంగ్‌డంగ్ ప్రావిన్స్‌లోని జుహాయ్ విమానాశ్రయం నుంచి గాల్లోకి దూసుకెళ్లినట్లు చైనా వార్తా సంస్థ షిన్ హువా తెలిపింది.

ఐఎన్‌ఎస్ కల్వరి జలప్రవేశంస్కార్పిన్ శ్రేణికి చెందిన అత్యాధునిక జలాంతర్గామి ‘ఐఎన్‌ఎస్ కల్వరి’ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్ 14న ముంబైలో భారత నౌకాదళంలో ప్రవేశపెట్టారు. ఈ జలాంతర్గామిని ఫ్రెంచ్ కంపెనీ డీసీఎన్‌ఎస్ డిజైన్ చేయగా రక్షణ శాఖకు చెందిన మజగాన్ డాక్ లిమిటెడ్ (ఎండీఎల్-ముంబై) నిర్మించింది. హిందూ మహాసముద్రంలోని భయంకరమైన ‘టైగర్’ షార్క్ (మలయాళంలో కల్వరి అంటారు) పేరును ఈ జలాంతర్గామికి పెట్టారు. స్కార్పిన్ సిరీస్‌లో మొత్తం ఆరు సబ్‌మెరైన్లు నిర్మిస్తుండగా అందులో కల్వరి మొదటిది.
కల్వరి ప్రత్యేకతలుజలాంతర్గామి జాడ చిక్కకుండా ధ్వనిని అదుపు చేసే అత్యాధునిక సాంకేతికత. 
యాంటీ షిప్ క్షిపణులతో నీళ్లలోను, సముద్ర ఉపరితలంపైనా దాడిచేయవచ్చు. 
రేడియేషన్ స్థాయిలు అతి తక్కువగా ఉంటాయి. 
పొడవు: 67.5 మీ (221 అడుగులు)
వేగం: నీటిలో ఉన్నప్పుడు గంటకు 37 కి.మీ.
సముద్ర ఉపరితలంపై గంటకు 22 కి.మీ.
పరిధి: ఉపరితలంపై 12,000 కి.మీ. నీటిలో ఉన్నప్పుడు 1,020 కి.మీ.
18 టార్పెడోలను మోసుకెళ్లగలదు. 350 మీటర్ల లోతుకు వెళ్లగలదు


కెప్లర్ 90 సౌరవ్యవస్థలో 8వ గ్రహం గుర్తింపునాసా కృత్రిమ మేధ సాయంతో కెప్లర్ 90 సౌరవ్యవస్థలో 8వ గ్రహం కెప్లర్ 90ఐ ను డిసెంబర్ 14న గుర్తించింది. కెప్లర్ 90 గ్రహ వ్యవస్థ భూమికి 2,545 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. 90ఐ గ్రహం మాతృ నక్షత్రం చుట్టూ ఒక సారి తిరిగేందుకు 14.4 రోజుల సమయం తీసుకుంటుంది. దీని ద్రవ్యరాశి భూమి కంటే 2.5 రెట్లు ఎక్కువ. గ్రహం మొత్తమ్మీద ఉండే ఉష్ణోగ్రత 436 డిగ్రీల సెల్సియస్. భూమిని పోలిన గ్రహాలను గుర్తించేందుకు నాసా 2009లో కెప్లర్ టెలిస్కోప్‌ను ప్రయోగించింది. నాలుగేళ్లలో 35 వేల గ్రహాల ఉనికిపై కెప్లర్ సంకేతాలిచ్చింది.
కెప్లర్ టెలిస్కోప్ సేకరించిన సమాచారంతో గ్రహాల ఉనికిని గుర్తించడంపై కృత్రిమ మేధకు శిక్షణ ఇచ్చారు. బలహీనమైన సంకేతాలున్న 670 గ్రహ వ్యవస్థల సమాచారాన్ని కంప్యూటర్‌కు ఫీడ్ చేశారు. దాన్ని పరిశీలించిన కంప్యూటర్.. కెప్లర్ 90, కెప్లర్ 80 గ్రహ వ్యవస్థల్లో ఒక్కో కొత్త గ్రహం ఉన్నట్లు గుర్తించింది. కెప్లర్ 90లో 7 గ్రహాలను ఇప్పటికే గుర్తించారు. సౌరకుటుంబానికి ఆవల ఉన్న గ్రహ వ్యవస్థలో 7 గ్రహాలతో ట్రాపిస్ట్-1 మొదటి స్థానంలో ఉంది.
గ్రావిటీ లెన్సింగ్ అంటే?ప్రకాశవంతమైన నక్షత్రం ముందు నుంచి గ్రహం వెళ్తున్నప్పుడు అక్కడి నుంచి వచ్చే వెలుగు కొంచెం తగ్గుతుంది. ఈ తగ్గుదలను బట్టి అక్కడ గ్రహం ఉందా లేదా అనేది తెలుసుకుంటారు. దీనినే గ్రావిటీ లెన్సింగ్ అంటారు. కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉండే గ్రహాలను గుర్తించేందుకు ఈ పద్ధతిని శాస్త్రవేత్తలు ఉపయోగిస్తారు.


ఎంఐ-8 హెలికాప్టర్లకు వీడ్కోలు 45 ఏళ్ల సుదీర్ఘ కాలం పాటు సాయుధ బలగాలకు సేవలందించిన ఎంఐ-8 హెలికాప్టర్లు తెరమరుగయ్యాయి. ‘ప్రతాప్’గా పిలిచే సోవియెట్ కాలానికి చెందిన ఈ హెలికాప్టర్లకు వాయుసేన డిసెంబర్ 17న అధికారికంగా వీడ్కోలు పలికింది. 1972లో భారత వాయుసేనలో చేరిన ఇవి ఆపరేషన్ మేఘదూత్, ఆపరేషన్ పవన్ లాంటి కీలక సమయాల్లో సైనికులు, వాహనాల తరలింపులో విశేష సేవలందించాయి. బెంగళూరులోని ఎలహంక వైమానిక స్థావరంలో జరిగిన వీడ్కోలు కార్యక్రమంలో చివరిసారిగా ఇవి తమ విన్యాసాలతో ఆకట్టుకున్నాయి. ఎయిర్ చీఫ్ మార్షల్(రిటైర్డ్) ఫాలి హోమి మేజర్‌తో పాటు కొందరు మాజీ వాయు సేనాధికారులు చివరిసారి ఈ హెలికాప్టర్లను నడిపారు. 


సుఖోయ్‌కు బ్రహ్మోస్ అమర్చే ప్రక్రియ ప్రారంభంరష్యన్ తయారీ సుఖోయ్-30 యుద్ధవిమానాల్లో సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్‌ను అమర్చే ప్రక్రియ ప్రారంభమైనట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. దాదాపు 40 సుఖోయ్ యుద్ధవిమానాలకు ఈ క్షిపణుల్ని అమర్చనున్నట్లు వెల్లడించాయి. ఈ ప్రక్రియ 2020 నాటికల్లా పూర్తవుతుంది. సుఖోయ్-30 యుద్ధవిమానం ద్వారా తొలిసారి బ్రహ్మోస్‌ను నవంబర్ 22న ప్రయోగించారు. సుఖోయ్‌ల్లో బ్రహ్మోస్ క్షిపణుల్ని అమర్చే ప్రక్రియను ప్రభుత్వరంగ సంస్థ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ చేపట్టింది. తాజాగా సుఖోయ్ యుద్ధవిమానాల్లో ఈ మార్పులు చేపడితే.. సముద్రంపై, భూభాగాలపై ఉన్న సుదూర లక్ష్యాల్ని ఛేదించగల సామర్థ్యం వాయుసేనకు సమకూరుతుంది. భారత్-రష్యా రూపొందించిన బ్రహ్మోస్ క్షిపణి ధ్వనికంటే 3 రెట్లు వేగంగా దూసుకుపోతుంది. 2.5 టన్నుల బరువున్న ఈ క్షిపణి 290 కి.మీ పరిధిలోని లక్ష్యాలను ఛేదిస్తుంది.


రామసేతు మానవ నిర్మాణమే: సైన్స్ చానల్రామసేతు (Adam's Bridge) అనేది వేల సంవత్సరాల కింద మానవుడు నిర్మించినదేనని అమెరికా డిస్కవరీ కమ్యూనికేషన్‌‌స సంస్థకు చెందిన సైన్స్ చానల్ ఓ కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. ఇందులో పలువురు భూగర్భ, పురాతత్వ శాస్త్రవేత్తలు, ఉపగ్రహ చిత్రాలను ఉటంకిస్తూ ఆ నిర్మాణం సహజసిద్ధమైనది కాదని తేల్చింది. రామసేతువు వేల సంవత్సరాలుగా భూ పలకల్లో చోటు చేసుకున్న మార్పుల వల్ల ఏర్పడిన సహజ సిద్ధ నిర్మాణమనే వాదన మరోవైపు ఉంది. ఇది తమిళనాడులోని పంబన్, శ్రీలంకలోని మన్నార్ దీవుల మధ్య దాదాపు 50 కిలోమీటర్ల దూరంపాటు సముద్రంలో ఉంది. ఆ ప్రాంతంలోని ఇసుక సహజసిద్ధంగా ఏర్పడినది కాగా, దానిపై ఉన్న రాళ్లు మాత్రం కృత్రిమంగా తీసుకొచ్చి పేర్చినట్లు ఉన్నాయని అలన్ లెస్టర్ అనే భూవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు తెలిపారు. రామ సేతువు ప్రాంతంలో ఉన్న రాళ్లు 7 వేల ఏళ్ల పురాతనమైనవి కాగా, రామసేతువును దాదాపు 5 వేల ఏళ్ల క్రితం నిర్మించి ఉంటారనీ ఆ చానల్ పేర్కొంది.
రామసేతువు నిర్మాణాన్ని పరిశోధించే బాధ్యతను గతంలో భారత చారిత్రక పరిశోధన మండలి (ఐసీహెచ్‌ఆర్)కు అప్పగించారు. ప్రస్తుతం ఈ పరిశోధన కొనసాగుతోంది. అయితే చరిత్రలోని క్రీ.పూ 4,000- క్రీ.పూ 1,000ల మధ్య కాలాన్ని ‘డార్క్ పీరియడ్’గా పరిగణించి మరింత లోతుగా విశ్లేషించేందుకు ప్రయత్నిస్తున్నామని ఐసీహెచ్‌ఆర్ చైర్మన్ వై.సుదర్శనరావు వివరించారు.


గూగుల్ సెర్చ్‌లో బాహుబలి-2 టాప్2017లో ఇంటర్నెట్‌లో అత్యధికులు శోధించిన అంశాల్లో బాహుబలి-2 చిత్రం తొలిస్థానంలో నిలిచింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రెండోస్థానం, ‘లైవ్ క్రికెట్ స్కోర్’ అనే పదం మూడోస్థానంలో నిలిచాయి. ఈ మేరకు గూగుల్ డిసెంబర్ 13న ఒక జాబితా విడుదల చేసింది. ఇందులో బాలీవుడ్ సినిమా దంగల్, హాఫ్ గర్ల్‌ఫ్రెండ్, బద్రీనాథ్ కీ దుల్హానియా చిత్రాలు, చాంపియన్‌‌స ట్రోఫీ తదితర అంశాలు టాప్-10లో ఉన్నాయి. ఈ ఏడాదికి ‘సెక్సియెస్ట్ ఏషియన్ మ్యాన్’గా బాలీవుడ్ నటుడు షాహీద్ కపూర్ ఎంపికయ్యారు.


బెంగళూరులో అంతరిక్ష మ్యూజియందేశంలోనే తొలిసారిగా అంతరిక్ష విజ్ఞానాన్ని అందించే నూతన మ్యూజియంను నవంబర్ 29న బెంగళూరులో ప్రారంభించారు. ఉపగ్రహ తయారీ మొదలు అది అతరిక్షంలోకి వెళ్లే వరకు ఉండే విశేషాలను ఈ మ్యూజియంలో పొందుపరిచారు. దీనిని విశ్వేశ్వరాయ ఇండస్ట్రియల్ అండ్ టెక్నలాజికల్ మ్యూజియం (వీఐటీఎం)తో కలసి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఏర్పాటు చేసింది. ఇందులో రాకెట్ బయలుదేరినప్పటి నుంచి ఉపగ్రహం కక్ష్యలోకి వెళ్లే వరకు జరిగే ప్రతి ఘటననూ సిములేటర్ ద్వారా ప్రత్యక్ష అనుభవంలో చూడొచ్చు.